ఖైరతాబాద్, మార్చి 9 : కేంద్రం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్తో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిందని, సొంత ఎజెండాతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు.
సీబీఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలను సొంత ఏజెంట్లుగా పనిచేయించుకుంన్నదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఢిల్లీలో నిరసన దీక్ష చేసేందుకు ముందుకు సాగితే దానిని భగ్నం చేయాలని చూస్తున్నారని, కేంద్ర వైఖరిని ప్రశ్నిస్తున్నందునే ఆమెపై అక్రమ కేసులు పెట్టారన్నారు. తెలంగాణ సమాజం ఆమెకు అండగా నిలబడుతుందన్నారు. కేంద్రం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.