సిటీబ్యూరో,ఆగస్టు 30 (నమస్తేతెలంగాణ) : ఐటీ, ఫార్మా, ఇతర పారిశ్రామిక రంగాల అభివృద్ధిలో నగరంలో ఆఫీస్ స్పేస్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయం, సులభమైన ప్రయాణ సౌకర్యం, నివాసయోగ్యత ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నగరానికి క్యూ కడుతున్నాయి. దేశవ్యాప్తంగా గ్రేడ్ ఏ ఆఫీస్ స్థలం మొత్తం 37.6 మిలియన్ చదరపు అడుగులు నిర్మాణంలో ఉండగా, అందులో 10.3 మిలియన్ చదరపు అడుగుల స్థలం కేవలం హైదరాబాద్లోనే నిర్మాణమవుతున్నది. న్యూఢిల్లీలో 7.8 మిలియన్ చదరపు అడుగులు, బెంగళూరుతో 6.6 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు చేస్తున్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సంస్థ జేఎల్ఎల్ తన తాజా నివేదికలో వెల్లడించింది. కరోనా మొదటి, రెండు దశలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినా, మెట్రో నగరాల్లో ప్రధానంగా హైదరాబాద్ చక్కటి పురోగతి సాధిస్తున్నదని, ఇందుకు నిదర్శనం ప్రస్తుతం నిర్మాణంలో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులేనని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు.
హైదరాబాద్లో ఇప్పటివరకు 1.05 కోట్ల చదరపు అడుగులను అద్దెకు తీసుకున్నారు. 15 మందికి పైగా ఆఫీస్స్పేస్ డెవలపర్లు వివిధ వ్యాపార సంస్థల భాగస్వామంతో కలిసి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను నిర్మిస్తుండటంతో నాణ్యతలోనూ రాజీపడటం లేదు. ఇందులో 80-90 శాతం నిర్మాణాలు నగరానికి పశ్చిమభాగంలో ఉన్నాయి. ఆఫీస్ స్పేస్ను లీజుకు తీసుకున్న సంస్థలు ఇక్కడి నిర్మాణాలతోపాటు ప్రభుత్వపరంగా కల్పిస్తున్న మౌలిక వసతుల పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ఆఫీస్ స్పేస్ రంగంలో పెట్టుబడుల సెంటిమెంట్ బలంగా ఉందని, అందుకే నిర్మాణ దశలోనే అద్దెకు తీసుకునే వారి సంఖ్య బాగా ఉందని వారంటున్నారు.
నగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం పశ్చిమం. ప్రముఖ ఐటీ కంపెనీలు కొలువై ఉండటంతో సమీపంలో ఇండ్లు, అపార్ట్మెంట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. వెస్ట్జోన్ పరిధిలోని మాదాపూర్, హైటెక్సిటీ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లలో ఐటీ, ఐటీఈఎస్ కార్యాలయాలతోపాటు నివాస ప్రాంతాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో దాదాపు ఖాళీ స్థలమంతా నిర్మాణంలో ఉండగా, తర్వాత డిమాండ్ కోకాపేట కేంద్రంగా ఉండనుంది. ప్రస్తుత మిక్కడ సుమారు 30 నుంచి 50 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ నిర్మాణం జరుగుతుండగా, రాబోయే 3-4 ఏండ్లలో మరో కోటి నుంచి 2 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టే ప్రణాళికలున్నట్లు తెలిసింది. ముఖ్యంగా కోకాపేటలో హెచ్ఎండీఏ 535 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నియోపొలిస్ భారీ లేఅవుట్లోనే కోటికి పైగా చదరపు అడుగుల నిర్మాణాలు చేసేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ లేవుట్ కాకుండా ప్రైవేట్ స్థలాల్లో ఆఫీస్ స్పేస్, నివాస నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. ఐటీ రంగంలో పనిచేస్తున్న సుమారు 6 లక్షల మంది ఉద్యోగుల్లో అధిక భాగం వెస్ట్జోన్ పరిధిలో నివాసముండేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో అధికశాతం ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఉన్న వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలే అద్దెకు తీసుకుంటున్నాయి. ఈ రెండు విభాగాల్లో కంపెనీలు 42 శాతం ఉండగా, స్టార్టప్స్ కంపెనీలు, కోవర్కింగ్ కార్యాలయాలు నిర్వహిస్తున్న వారు 10 శాతం వరకు ఐటీ కారిడార్లోనే ఉన్నారు. మెట్రోనగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాల ఆఫీస్ స్పేస్ వాటా 70 శాతం ఉందని ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. మొత్తంగా దేశంలో హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ విభాగంలో దూసుకుపోతున్నదని, మరో మూడు, నాలుగేండ్ల పాటు ఇదే డిమాండ్ ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.