సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు అవసరమైన సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఆరు కేంద్రాలు, ఎన్జీవోల ఆధ్వర్యంలో ఉన్న 44 కేంద్రాల్లో మొత్తం 4000 పైగా పిల్లలు ఉన్నారని తెలిపారు.
వీరిలో చాలా మందికి జనన, కుల, ఆధార్, సదరం, అర్బన్ వంటి సర్టిఫికెట్లు లేవన్నారు. ఈ సర్టిఫికెట్ల జారీ కోసం ఈ నెల 22 నుంచి 27 వరకు ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్, ఆర్డీవోలు సూర్యప్రకాశ్, రవికుమార్, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు, జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటీ, బీసీహెచ్ఎస్ డాక్టర్ సునీత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.