ప్రజల శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి నిమిషం పనిచేస్తున్న పోలీసుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటూ వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. శనివారం పాతబస్తీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పేట్లబురుజు)లో పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ విజృంభిస్తున్నదని, నగర పోలీసులు కూడా అనేకమంది వైరస్ బారినపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసు సిబ్బంది కుటుంబ పరిస్థితులు, ఆర్థికస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఈ ఐసొలేషన్ కేంద్రంలో పాజిటివ్ వచ్చిన వారితోపాటు స్వల్ప కరోనా లక్షణాలు కలిగిన సిబ్బందికి వైద్యమందిస్తామని ఆయన తెలిపారు. ఈ కేంద్రంలో 24 గంటలపాటు వైద్య సేవలు, ఆహారం అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి రహేజా మైండ్స్పేస్, ఇన్ఫోసిస్, డీఈ షా, సీఐఐ, కేర్ ఆస్పత్రి తదితర సంస్థలు చేయూత ఇస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు శిఖాగోయల్, అనిల్కుమార్, డీఎస్ చౌహాన్, డాక్టర్ ప్రశాంతి, భరణి అరోల్ తదితరులు పాల్గొన్నారు.