సిటీబ్యూరో, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): పుట్టుకతోనే ఎడమ వైపున ఉండాల్సిన గుండె కుడివైపు, కుడి వైపు ఉండాల్సిన అవయవాలు ఎడమ వైపు ఉండటమే కాకుండా గుండెకు రంధ్రం ఉన్న ఒక బాలికకు ‘ప్రతిమా’ వైద్యులు దాదాపు 8 గంటలకు పైగా శ్రమించి ‘ఇంట్రా కార్డియాక్ రిపేర్’ సర్జరీని పూర్తి చేశారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 14 ఏండ్ల బాలికకు ఓ దగ్గర ఉండాల్సిన అవయవాలు మరో దగ్గర ఉండటంతో పాటు గుండెకు రంధ్రంతో శ్వాస సమస్యతో బాధ పడుతుంది. దీంతో కుటుంబ సభ్యులు కాచిగూడ ప్రతిమ వైద్యశాలకు తీసుకురాగా అక్కడి వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి గుండెలో రంధ్రంతోపాటు రోగిలో ఆక్సిజన్ స్థాయి పడిపోతున్నట్లు గుర్తించామని పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ వివేక్ బాబు బొజ్జవార్ తెలిపారు.
10 లక్షల మందిలో ఒకరికి ఇలాంటి క్లిష్టమైన సమస్యలు ఉంటాయని, ఈ సమస్యకు ఇంట్రా కార్డియాక్ రిపేర్తో పాటు ఇతర ప్రొసీజర్ను సైతం నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు. ఈ మేరకు డాక్టర్ వివేక్బాబు నేతృత్వంలో అనస్తీషియా వైద్యులు డాక్టర్ అమర్, కార్డియాలజిస్టు డాక్టర్ శ్రావణ్, పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రణీత్రెడ్డితో కూడిన వైద్య బృందం ఆగస్టు 29న బాలికకు హార్ట్ అండ్ లంగ్ మెషిన్ సహాయంతో దాదాపు 8 గంటల పాటు ‘ఇంట్రా కార్డియాక్ రిపేర్’ సర్జరీని విజయవంతంగా జరిపి, గుండెలో ఉన్న రంధ్రాన్ని పూడ్చి, ఊపిరితిత్తులకు రక్త సరఫరాను మెరుగు పరిచారు. రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఖర్చయ్యే ఈ శస్త్ర చికిత్సను ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా జరిపినట్లు ప్రతిమ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ బోయినిపల్లి తెలిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకుంటుందని.. ఇక సాధారణ జీవితాన్ని గడపవచ్చని దవాఖాన సీఈఓ డాక్టర్ అజిత్సింగ్ తెలిపారు.