సైదాబాద్, ఏప్రిల్ 5 : ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల దృష్టి మరల్చి బంగారు ఆభరణాలను తరస్కరించే అంతర్రాష్ట్ర మహిళా ముఠా సభ్యులను మాదన్నపేట పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో చేసిన పలు నేరాలతో వీరికి సంబంధం ఉన్నదని తెలిపిన పోలీసులు వారి వద్ద నుంచి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మాదన్నపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన మున్నియండి రమ్య (27), తిరువూరుకు చెందిన భువనేశ్వర్ మీనా (30), ఇలప్పయార్కు చెందిన మూతి మారి(30), అంజలి, పార్వతిలు ఒక ముఠాగా ఏర్పడి సరూర్ నగర్, కంచన్బాగ్, మాదన్నపేట, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు నేరాలకు పాల్పడ్డారు.
మీర్ పేట ఆర్ఎన్ నగర్ ద్వారకామాయీ కాలనీలో నివసించే సుబ్బ లక్ష్మమ్మ (74) మార్చి 25న ఎస్బీఐ బ్యాంకులో డబ్బులు తీసుకోవడానికి కంచన్ బాగ్కు . బ్యాంకులో 10 వేల రూపాయలను తీసుకొని ఇంటికి వెళ్లేందుకు పిసల్బండలో బస్ కోసం ఎదురుచూస్తుండగా ఈ మహిళ ముఠా సభ్యులు వృద్ధురాలు వద్దకు వచ్చారు. ఆమెతో మాటలు కలిపి వివరాలన్నీ ఆరా తీసి అప్పుడే వచ్చిన కోఠి వెళ్లే బస్సు ఎక్కించారు. ముఠా సభ్యులు సైతం అదే బస్సు ఎక్కుతున్నట్లు నటించి సుబ్బలక్ష్మమ్మను మాటల్లో దింపి మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు లాక్కొని బస్సు దిగి వెళ్లిపోయారు.
మాదన్నపేటలో వృద్ధురాలు బస్సు దిగిన తర్వాత మెడలో బంగారు గొలుసు కనిపించక పోవటంతో మాదన్న పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతోపాటు మూతులకు గుడ్డలు కట్టుకుని ఎక్కిన మహిళలపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల సాయంతో గాలించి ముగ్గురు నిందుతులను శనివారం అరెస్ట్ చేశారు. 9 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయలు నగదు స్వాధీనం చేసున్నారు. ముఠాలోని మరో ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.