Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలు జరిగాయి. ఇటీవల రాష్ట్రంలోని వివిధ మున్సిపల్ కమిషనర్లు డిప్యూటేషన్పై వచ్చిన వారికి పోస్టింగ్ ఇవ్వడంతో పాటు సంస్థలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అదనపు కమిషనర్ సరోజపై బదిలీ వేటు వేశారు. రెండు రోజుల కిందట జరిగిన కౌన్సిల్ సమావేశంలో సరోజ పనితీరుపై సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఏ మాత్రం తగదని హెచ్చరించారు. ఈ మేరకు సరోజను బదిలీ చేస్తూ..బుధవారం కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ విభాగానికి అదనపు కమిషనర్ ఉన్న సరోజను డిపార్ట్మెంట్ ఎంక్వైరీస్ విభాగానికి బదిలీ చేశారు. డిప్యూటేషన్పై బల్దియాకు వచ్చిన మున్సిపల్ కమిషనర్లు జి. నళిని పద్మావతి, కె.సత్యనారాయణ, జి. వేణుగోపాల్రెడ్డి, మహ్మద్ షేక్లకు పోస్టింగ్లు ఖరారు చేశారు. జి.నళిని పద్మావతికి ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ విభాగానికి, లీవ్లో ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీవాత్సవకు సంబంధించిన లీగల్, ఎలక్ట్రికల్ విభాగం బాధ్యతలను తాత్కాలికంగా కె.సత్యనారాయణకు అప్పగించారు. శేరిలింగంపల్లి జోన్ ఎస్డబ్ల్యూఎంకు జి. వేణుగోపాల్రెడ్డి, ఖైరతాబాద్ ఎస్డబ్ల్యూఎం డీసీగా మహ్మద్ షేక్లకు బాధ్యతలు అప్పగించారు.