మేడ్చల్, అక్టోబర్21(నమస్తే తెలంగాణ): ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ అన్నారు. ఈ నెల 25 నుంచి జరిగే మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై గురువా రం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద వైద్యశాఖ ఆధ్యర్యంలో ప్రథమ చికిత్స శిబిరాలను ఏర్పాటు చేసి మా స్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
విద్యార్థులకు జ్వర లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక గదిలో పరీక్షలు రాయించాలన్నారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యం అయినా అనుమతించవద్దని ఆదేశించారు. అంతకు ముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, కమిషనర్ జలీల్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా ఎడ్యుకేషన్ అధికారి కిషన్, డీఈవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాల అమలు తీరును జిల్లా స్థాయి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించనున్నట్లు కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అధికారుల బృందాలు పర్యటించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి వివరాలను తెలుసుకుంటాయన్నారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 2 వరకు ఈ బృందాలు పర్యటిస్తాయన్నారు. సమావేశంలో డీఆర్డీవో పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి వివరించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై గురువారం మంత్రి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. కాగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 71,569 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, హైదరాబాద్, సికింద్రాబాద్ కలిపి 274 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.