సైదాబాద్, మే 16 : ఖరీదైన మొబైల్ ఫోన్ల దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలోని ఆరుగురు సభ్యులను కంచన్బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారని, నిందితుల నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, విడిభాగాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం కంచన్బాగ్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రాయన్గుట్ట ఏసీపీ సుధాకర్, ఇన్స్పెక్టర్ జక్కుల మల్లేశంతో కలిసి వివరాలు వెల్లడించారు. గత నెల15న సయ్యద్ నజీర్ అహ్మద్ అనే వ్యక్తి డీఎంఆర్ఎల్ చౌరస్తా నుంచి వెళ్తుండగా మోటర్ సైకిల్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్ లాక్కొని వెళ్లారు. దీంతో బాధితుడు కంచన్ బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్రైం పోలీస్ బృందం సీసీటీవీ పుటేజ్లను పరిశీలించి, సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కదలికలను గుర్తించి వారిపై నిఘా పెట్టి పక్కా సమాచారం సేకరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వీరి నేరాలపై ఆరా తీసి పక్కా సమాచారంతో నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
ప్రధాన నిందితుడు అంబటి నరేష్ అలియాస్ కావటి నరేష్పై జగద్గిరిగుట్ట, ఎస్ఆర్ నగర్ పోలీస్స్టేషన్లో 3 కేసులున్నాయని, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన బనాల అరుణ్కుమార్ అలియాస్ నానిపై భవనగిరి, శ్రీకాళహస్తి, మార్కెట్ పీఎస్, పటాన్చెరువు, ఉస్మానియా యునివర్శిటీ పోలీస్స్టేషన్లలో 6 కేసులు ఉన్నాయని, అనంతపురం గుత్తికి చెందిన మేకల చిరంజీవి అలియాస్ చిరుపై నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయని, తోట సూరిపై ఆదిభట్ల, జూబ్లిహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో 2 కేసులు, తోట చందుపై చైతన్యపురి పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదై ఉందని, సందీప్ జైస్వాల్ ( దొంగలించిన వస్తువులను కొనుగోలు చేసే వ్యక్తి)లను అరెస్ట్చేసినట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులైన తోట వసంత్, శశి, ప్రేమ్తోపాటు మరింత కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.
రద్దీ ప్రాంతాల్లో అమాయకులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని ఆర్టీసీ బస్స్టేషన్లు, మర్కెట్లు, టిఫిన్ సెంటర్ల వద్ద పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనాలకు పాల్పడుతూ వారి ముఖాలు కన్పించకుండా పేపర్లు, కవర్లు అడ్డపెట్టుకుని మొబైల్ ఫోన్లను చాకచక్యంగా దొంగలిస్తారని, వాటిని 1,500 నుంచి రూ.2వేలకు అమ్మడం, కొన్ని ఫోన్ల విడిభాగాలు తీసి మొబైల్ రిపేర్ షాపులకు అమ్మేయడం చేస్తారని తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల వద్ద నుంచి 14 ఫోన్లు, 132 వివిధ బ్రాండ్లకు చెందిన బ్యాటరీలు, 172 మదర్ బోర్డులు లేని మొబైల్ బాడీలు, 73 కెమెరా విడిభాగాలు, నేరానికి ఉపయోగించిన ఒక బజాజ్ పల్సర్ మోటర్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.