సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): థర్డ్వేవ్ తరుముకొస్తుందా అంటే అవుననే అంటున్నారు వైద్యనిపుణులు. వారం క్రితం రెండంకెల్లో ఉన్న కరోనా కేసులు ప్రస్తుతం నాలుగు అంకెలు దాటుతున్నాయి. గ్రేటర్లోని అన్ని ప్రాంతాల్లో కరోనా జాడలు కనిపిస్తున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వారు, మొదటి, రెండవ దశలో కొవిడ్కు గురైన వారు సైతం మళ్లీ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో వైద్యశాలల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటికే గాంధీలో 30కి పైగా కరోనా రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. టీమ్స్లో సుమారు వందకు పైగా చికిత్స తీసుకుంటున్నారు. ఇక ప్రైవేటు దవాఖానల్లో పరిస్థితి సరేసరి. కొత్తగా వస్తున్న ఒమిక్రాన్ తీవ్రత రోగులపై పెద్దగా లేనప్పటికీ వాయువేగంతో వ్యాప్తి చెందుతున్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న ఐసీయూ కేసులు..
ప్రస్తుతం నమోదవుతున్న కరోనా కేసుల్లో అధిక శాతం డెల్టా వేరియంటే ఉండటంతో తీవ్రత పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. గత మూడు నాలుగు రోజులుగా గాంధీలో ఐసీయూ కేసుల సంఖ్య పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనమంటున్నారు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. గతంలో గాంధీకి ఒకటి రెండు కేసులు మాత్రమే వచ్చేవని.. ప్రస్తుతం పదుల సంఖ్యలో ఐసీయూ కేసులు వస్తుండటం కొంత ఆందోళనకు గురయ్యే విషయమేనని అంటున్నారు వైద్య నిపుణులు.
చకచకా ఏర్పాట్లు..
కరోనా థర్డ్వేవ్ సంకేతాలు అందుతున్న నేపథ్యంలో గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అన్ని దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. గ్రేటర్లో మొత్తం 3,133 పడుకలను సిద్ధం చేశారు. మరో వెయ్యి పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇప్పటికే గాంధీలో 1500, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో 303, కింగ్కోఠి జిల్లా దవాఖానలో 350, టిమ్స్లో 980 చొప్పున ఐసీయూ పడకలను వైద్యాధికారులు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అంతేకాక నిలోఫర్లో చిన్నపిల్లల కోసం ప్రత్యేక ఐసీయూ వార్డులను అందుబాటులోకి తెచ్చారు. పొరుగు రాష్ర్టాల్లో పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే గ్రేటర్, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు.