సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంటున్న వేళ.. ప్రజల రక్షణ, పర్యావరణ భద్రతకు ప్రభుత్వం ముందు చూపుతో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికింది. ఓ వైపు పర్యావరణ పరిక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా హరితహారంతో పచ్చని వనంలా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నది. మరోవైపు కాలుష్యాన్ని కట్టడి చేసేలా విద్యుత్తు వాహనాల వినియోగం పెంచడానికి ప్రతిష్టాత్మకమైన సదుస్సులు నిర్వహిస్తున్నది. దేశంలో మొదటిసారిగా మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు తెలంగాణలోనే కావడం దీనికి నిదర్శనం.
ఇతర రాష్ర్టాల మాదిరిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈవీల్లో వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రముఖ ఈవీ కంపెనీలు, సాఫ్ట్వేర్ రూపకర్తలు హెచ్ఐసీసీలో జరుగుతున్న హైదరాబాద్ ఈ -మొబిలిటీ సదస్సుకు హాజరయ్యారు. ఎలక్ట్రిక్ వెహికిల్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల భాగస్వామ్యం, కంపెనీల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై వేర్వేరుగా ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. పర్యావరణాన్ని రక్షించుకునే స్థిర రవాణా వ్యవస్థను రూపొందించే మార్గాలను అన్వేషించేలా చర్చలు సాగుతున్నాయి. హైదరాబాద్ వేదికగా మొబిలిటీ సదస్సు జరగడం, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంపై వక్తలు సంతోషం వ్యక్తం చేశారు.
కేటీఆర్ గొప్ప దార్శనికుడు
గొప్ప ఆలోచనను ఎలా ప్రోత్సహించాలో కేటీఆర్కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఆయన సృజనాత్మకతను గుర్తించి ప్రతిభను ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి నాయకుడు తెలంగాణలో ఉండటం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమవుతున్నది. ప్రపంచంలోనే మోస్ట్ ఐకానిక్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ఉంది. రీసెంట్గా నేను మాసెరాటి ఎంసీ 20 సూపర్కారును ఇటీవల కొనుగోలు చేశాను. ఇది మూడు సెకన్లలో 0-60 వేగంతో పరగులు తీస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అంతే వేగంతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పర్యావరణానికి నష్టం చేకూరని విధంగా రవాణా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఈవీ రంగంలో గొప్ప మార్పు కనబడబోతుంది.
– మమతా చామర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, గ్లోబల్, అమెరికా అండ్ ఏషియా
తెలంగాణ విధానాలు భేష్..
తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-2030 ప్రభుత్వ క్రియాశీలతకు నిదర్శనం. కాలుష్య కారకాల ఉద్గారానికి సంబంధించిన నిబంధనలు వాహన తయారీదారులను ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టేలా చేయడంలో రాష్ట్రం అందించే సహకారం మరవలేనిది. హైదరాబాద్ ఈ -మొబిలిటీ వీక్ ద్వారా ఈవీ రంగం మరింత ఉత్సాహంగా పరుగులు తీసేలా విధానాలను సృష్టించుకుంటాం.
– కమాల్బాలి, సీఐఐ సౌతర్న్ రీజియెన్ డిప్యూటీ చైర్మన్, వోల్వో ఇండియా ఎండీ
ఆవిష్కరణలకు ప్రాధాన్యం
ఈ రోజు కార్లు సాఫ్ట్వేర్తో ఆధునాతనంగా మార్కెట్లోకి వస్తున్నాయి. అద్భుతైన ఫీచర్లు కలిగి ఉన్న వాహనాలకు ధర అధికంగా ఉంటుంది. ఈవీ రంగంలో వాటన్నింటిని పరిగణలోకి తీసుకుని మార్కెట్ పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ఈ- మొబిలిటీ వీక్తో ఈవీలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కార మార్గాలపై దృష్టిపెట్టాం. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంది.
– ఆర్.కె.షెనాయ్, ఎగ్జిక్యూటివ్ లీడర్ షిప్ టీమ్ సభ్యుడు (మొబిలిటీ సొల్యూషన్స్)
అందరి భాగస్వామ్యంతోనే ఈవీ వృద్ధి..
ప్రభుత్వం, పరిశ్రమలు, వినియోగదారులు, పౌర సమాజం ఇలా అందరూ కలిసి ఈవీ వృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరగలం. ఈ-వీలర్ మారెట్ ను నిర్మించడంలో ప్రతి ఒక్కరూ తమ వినూత్న ఆలోచనలు పంచుకోవాలి. సులభంగా అందుబాటులో ఉండే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ విధానాలు మాకు సంతృప్తినిచ్చాయి.