సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : దేశవ్యాప్తంగా ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో పేరుగాంచిన గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)ని మరింత విస్తరించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. దీన్ని ఏర్పాటు చేసి 20 వసంతాలు పూర్తికాగా, ఇక్కడ అభ్యసించిన ఎంతోమంది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు. ఫైనాన్సియల్ టైమ్స్-2020 ర్యాంకింగ్స్లో పీజీ పీమ్యాక్స్ కోర్సు నిర్వహణతో దేశంలోనే ఐఎస్బీ మొదటి స్థానం పొందగా, ప్రపంచ ర్యాంకింగ్స్లో 53వ స్థానం దక్కించుకుంది. ఎంతో ప్రతిష్టతలు పొందిన ఐఎస్బీని సుమారు రూ.450 కోట్ల వ్యయంతో అదనంగా కొత్త భవనాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పించనున్నారు.
ఐఎస్బీ కోసం గచ్చిబౌలిలో అప్పటి ప్రభుత్వం సుమారు 250 ఎకరాలను కేటాయించగా, ఇందులో 1.2లక్షల చదరపు అడుగుల్లో వివిధ భవనాలు నిర్మించారు. తాజాగా విస్తరణ ప్రణాళికతో మరో లక్ష చదరపు అడుగు విస్తీర్ణంలో నూతనంగా భవనాలు నిర్మించాలని యోచిస్తున్నారు. దీంతో మొత్తం 2.2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు ఉండనుండగా, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. క్యాంపస్లోని 30 ఎకరాల్లో గ్రీన్బెల్ట్ను ఐఎస్బీ అభివృద్ధి చేసింది. 18.5 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్ను తీర్చిదిద్దనున్నారు. ప్రధానంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) ను పూర్తిగా ఆధునీకరించనున్నారు. ఐటీ కారిడార్ మధ్యలోనే ఐఎస్బీ క్యాంపస్ ఉండడంతో దేశ, విదేశాలకు చెందిన వారు ఇందులో అభ్యసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.