సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఒక సమస్యకు చక్కని పరిష్కారాన్ని చూపడమంటే సమాజానికి ఉత్తమ సేవ చేసినట్లేనని, అది వారి జీవితంలో నిజమైన విజయమని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన ఐఐటీ హైదరాబాద్ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశం ఆవిష్కరణలకు అత్యంత కీలక కేంద్రమని, రకరకాల ఆవిష్కరణలు జరిగాయని పేర్కొన్నారు. కొత్తగా నానో టెక్నాలజీపై విసృత్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. ఐఐటీ హైదరాబాద్ డీన్ (అల్యుమినీ రిలేషన్స్) డాక్టర్ ముద్రికా ఖండేల్వాల్ మాట్లాడుతూ..పూర్వ విద్యార్థులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఐఐటీ హైదరాబాద్ విద్యాలయం ప్రారంభం నుంచే ఒక స్టార్టప్లా ఉండి ముందు తీసుకువెళ్తుందని ప్రశంసించారు.సమావేశంలో ఐఐటీ హెచ్ అల్యుమినీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.సాయి చంద్ర తేజ, జపాన్కు చెందిన మాజీ రాయబారి హైదెకి డొమిచి, తదితరులు పాల్గొన్నారు.