తెలుగు యూనివర్సిటీ,ఆగస్టు 11. ప్రముఖ కవయిత్రి, వ్యాఖ్యాత ఐనంపూడి శ్రీ లక్ష్మిని ఆచార్య పాకాల యశోదారెడ్డి పురస్కారంతో తెలంగాణ సారస్వత పరిషత్తు సత్కరించింది. బుధవారం బొగ్గులకుంటలోని పరిషత్తులో ని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళా మందిరంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పురస్కార ప్రదాన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐనంపూడి శ్రీలక్ష్మికి రూ.5 వేల నగదు, జ్ఞాపికతో పాటు యశోదరెడ్డి పురస్కారాన్ని ప్రదా నం చేసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1945లో స్థాపితమైన సారస్వత పరిషత్తు తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధికి చేస్తున్న సేవ మరువరానిదన్నారు.
సభాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ తెలుగులో వచ్చిన హరి వంశాలపై ప్రామాణిక పరిశోధన చేసి వెయ్యి పుటల బృహత్ గ్రంథాన్ని పురస్కార గ్రహీత శ్రీలక్ష్మి రాశారని వెల్లడించారు. సృజనాత్మక రచయిత్రిగా ప్రత్యేక ముద్ర వేసుకోవడంతో పాటు సాహిత్య,సామాజిక,సాంస్కృతిక రంగాలలో శ్రీ లక్ష్మి విశేషంగా కృషి చేశారని చెప్పారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ కరోనా తొలినాళ్లలో శ్రీలక్ష్మి రచించిన ‘కరోనాకు రిటర్న్ గిఫ్ట్’ అనే కవితను సీఎం కేసీఆర్ ఎంతగానో మెచ్చుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం ‘యశోదారెడ్డి కథల్లో తెలంగాణం’ అనే అంశంపై శ్రీ లక్ష్మి చేసిన విశ్లేషణాత్మక ప్రసంగం సభికులను ఆకట్టుకుంది.కార్యక్రమంలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య,యశోదా రెడ్డి కుమార్తె, నిఫ్ట్ ప్రొఫెసర్ లక్ష్మిరెడ్డి, పరిషత్తు కోశాధికారి మంత్రిరామారావు పాల్గొన్నారు.