రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు వరాల జల్లు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్లా గతంలో ఎవరూ చిత్తశుద్ధితో కృషి చేయలేదని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని
ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వానికి బ్రాహ్మణ సమాజమంతా రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
– మేడ్చల్, జూన్1(నమస్తే తెలంగాణ)
బ్రాహ్మణ సమాజ పరిరక్షణ సీఎం కేసీఆర్కే సాధ్యం. ఆయన అధికారంలోని వచ్చిన తర్వాతే బ్రాహ్మణులకు గుర్తింపు లభించింది. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ, దైవ సేవ చేస్తున్న తమ సమాజాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దూప దీప నైవేద్య పథకాన్ని రూ.10వేలకు పెంచి, మరో 6441 దేవాలయాలకు విస్తరించడం, అర్చక భృతిని రూ.5వేలకు పెంచడం సంతోషాన్ని కలిగించింది. ఐఐఎం, ఐఐటీల్లో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, గౌరవభృతి అర్హతను 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు కుదించడం, కొల్చారంలో సంస్కృత విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడం ఆయన హిందూ ధర్మ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలకు నిదర్శనం. ఇంత వరకు ఏ ప్రభుత్వం బ్రాహ్మణ సమాజం గురించి ఆలోచించలేదు. సీఎం కేసీఆర్కు, ఆయనకు కుటుంబ సభ్యులకు భగవంతున్ని ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి.
– మరింగంటి శ్రీకాంత్, స్థానాచార్యులు, రామానుజస్వామి ఆలయం, గౌడవెల్లి
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం బ్రాహ్మణుల అదృష్టం. బ్రాహ్మణ సంక్షేమానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నాడు. హిందూ పరిరక్షణకు దేవాలయాల అభివృద్ధికి అనేక నిధులను అందించిన హిందూ ధార్మిక పరిరక్షణకు కేసీఆర్ అపంద్భాదవుడు అయ్యాడు. బ్రాహ్మణులులలో అనేక మంది నిరుపేదలు ఉన్నట్లు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబాలలో వెలుగులు నింపేలా వేలాది మంది అర్చకులకు గౌరవ వేతనం అందిస్తున్నాడు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రతి ఏటా కోట్లాది నిధులను కేటాయించి నిరుపేద బ్రాహ్మణులకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సహయం అందిస్తున్నాడు. బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లగా ఉండాలి.
– రఘుచార్యులు, బ్రాహ్మణ సేవావాహిని రాష్ట్ర అధ్యక్షడు, మల్కాజిగిరి
హిందూధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను సమానంగా చూస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. దూప, దీప నైవేద్యం పథకాన్ని మరిన్ని ఆలయాలకు విస్తరించడంతో పాటు అర్చకులకు ఇచ్చే వేతనాలను 10వేలకు పెంచడం సంతోషకరం. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ఏర్పాటు చేయడమే కాకుండా బ్రహ్మణుల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ అసలుసిసలైన హిందువు. దేశవ్యాప్తంగా బ్రాహ్మణుల గురించి ఆలోచించిన ఏకైక నేత కేసీఆర్. బ్రాహ్మణులపై సీఎం కేసీఆర్ చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు బ్రాహ్మణులందరు రుణపడి ఉంటాం.
– డి.లక్ష్మణాచార్యులు
ఉద్యమ నాయకుడిగా, పాలకుడిగా కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా తప్పకుండా హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. ఆయన కంటే గొప్ప హిందుత్వవాది మరెవరూ లేరు. సీఎం కేసీఆర్ పాలనలోనే యాదాద్రి అద్భుత కట్టడంగా తీర్చిదిద్దారు. ఎన్నో ఆలయాలు జీర్ణోద్ధరణకు నోచుకున్నాయి. ధూప దీప నైవేద్య పథకాన్ని మరిన్ని ఆలయాలను ఎంపిక చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా రూ. 10 వేలకు పెంచుతున్నారు. బ్రాహ్మణులకు వేతనాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. బ్రాహ్మణ పరిషత్కు రూ. 100 కోట్లు కేటాయించి బ్రాహ్మణుల ఆత్మగౌరవం పెంచారు. హిందూ ధర్మాన్ని రక్షించడానికే 9 ఎకరాలలో రూ. 12 కోట్లతో బ్రాహ్మణ సదన్ను నిర్మించడం శుభపరిణామం.
– వీరేశం పంతులు, ప్రధాన అర్చకులు,రాజరాజేశ్వరస్వామి దేవాలయం మహేశ్వరం.
బ్రాహ్మణుల ఆత్మగౌరవం మరింత పెరిగేలా సీఎం కేసీఆర్ తోడ్పాటును అందిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో బ్రాహ్మణ సదన్ నిర్మాణం చరిత్రాత్మకం. మునుపెన్నడూ ఏ ప్రభుత్వాలు ఇలాంటి ప్రయత్నాన్ని చేసిన దాఖలాలు లేవు. నూతన సచివాలయ ప్రారంభోత్సవం రోజున ధూప దీప నైవేద్య పథకానికి నిధులు మంజూరు చేస్తూ తొలి సంతకం చేయటం ద్వారా తన ధార్మిక చిత్తశుద్ధిని సీఎం కేసీఆర్ మరోసారి చాటుకున్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు ద్వారా వివేకానంద విద్యాపథకంతో ఉన్నత విద్యకు తోడ్పాటునివ్వడం పేద బ్రాహ్మణ విద్యార్థులకు గొప్ప వరం. అత్యంత సౌకర్యవంతమైన బ్రాహ్మణ సదనం నిర్మాణంతో పాటు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆయనకు యావత్ బ్రాహ్మణుల సంపూర్ణ ఆశీర్వాదాలుంటాయి.
– ముకురాల చంద్రశేఖర శర్మ
సీఎం కేసీఆర్ నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు. ఆయన ధర్మ పరిరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నారు. హిందూ ధర్మంలో భాగమైన ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. చండీయాగం లాం టి ఆధ్మాత్మిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న అర్చకులు, బ్రాహ్మణులను పోషిస్తున్నారు. ధర్మాన్ని ఆచరిస్తూ పరిరక్షిస్తున్న బ్రాహ్మణ సమాజాన్ని ఆయనలా ఇప్పటి వరకు ఎవరూ ఆదుకోలేదు. విప్రహిత బ్రాహ్మణ సదన్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయాలతో బ్రాహ్మణ సమాజానికి మేలు జరుగుతుంది. గౌరవ భృతిని రూ.2500 నుంచి రూ.5000లకు పెంచడం, దూప, దీప నైవేద్య పథకం కింద అర్చకులకు ఇస్తున్న మొత్తం రూ.6వేలు నుంచి రూ.10వేలు పెంచడం శుభపరిణామం.
– తిరుమల మనోహరాచార్య, రామానుజ యాగ్నిక పీఠం
దక్షిణభారత దేశ సహాయ కార్యదర్శి, మేడ్చల్
కాకతీయుల తర్వాత మళ్లీ ఆస్థాయిలో సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సనాతన ఆధ్యాత్మిక వైభవం కనిపిస్తున్నది. బ్రాహ్మణ సంక్షేమానికి సీఎం కేసీఆర్ చూపించిన శ్రద్ధ గతంలో ఏ పాలకుడూ చూపించలేదు. రాష్ట్రం సిద్ధించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినన్ని యాగాలు ఏ నాయకుడూ చేయలేదు. హైందవ ధర్మం పాటించడంలో ఆయనకు ఎవరూ సాటిలేరు. బ్రాహ్మణులకు ప్రభుత్వం వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. సీఎం కేసీఆర్ వల్లనే రాష్ట్రంలో బ్రాహ్మణులకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.
– రేవల్లె రాజుశర్మ, కందుకూరు, దాసర్లపల్లి
బ్రాహ్మణ సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన బ్రాహ్మణ బంధువు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణలో బ్రాహ్మణ విప్రహిత భవనం ప్రారంభించడం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో బాహ్మణుల పురోగతికి అనేక పథకాలు ప్రవేశపెట్టడం అభినందనీయం. వేద పండితులకు వేతనం పెంచడం నాకు ఆనందం కలిగించింది. దేవాలయాల దూప దీప నైవేద్యాల రుసుమును పెంచడంపై అర్చకులు ఆనందపడుతున్నారు. నిరంతరం ధర్మ రక్షణ కోసం కృషి చేస్తున్న బ్రాహ్మణులకు సీఎం కేసీఆర్ వల్ల దేశవ్యాప్తంగా ఆత్మగౌరవం పెరిగింది.
– గంగాధర కేదార శర్మ ఘనాపాటి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 1700 దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలను అమలు చేయడం హర్షణీయం. ఏ రాష్ట్రంలో లేని విధంగా దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగులకు ప్రభుత్వ జీతభత్యాలను అందించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేయడమే కాకుండా బ్రాహ్మణ భవన్ను నిర్మించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
-గంగు ఉపేంద్రశర్మ, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ధార్మిక, ఆధ్యాత్మిక భావనలు ఉన్న సీఎం కేసీఆర్ అర్చక, ఉద్యోగుల జీవితాలలో వెలుగులను నింపారు. ఆయుత చండీ హోమాన్ని నిర్వహించడం… యాదాద్రి, వేములవాడ, కొండగట్టు వంటి పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించి నిఖార్సైన హిందుత్వవాదిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. దేశంలోనే మొట్టమొదటిసారి బ్రాహ్మణ భవన్ను 9 ఎకరాలలో 12 కోట్లతో భవనంలో కల్యాణ మండపం నిర్మించడం అభినందనీయం.
– క్రిష్ణమాచారి, తెలంగాణ దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
బ్రాహ్మణుల సంక్షేమానికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్ వేద పండితుల గౌరవ భృతిని పెంచడం హర్షణీయం. గౌరవ భృతిని రూ. 5 వేలకు పెంచడంపై బ్రాహ్మణ లోకం సంతోషిస్తుంది. బ్రాహ్మణ, అర్చక, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
– పరాశరం రవీంద్రాచార్యులు, జేఏసీ కన్వీనర్
వేదశాస్త్ర పండితులకు ప్రతి నెల ఇస్తున్న గౌరవ భృతిని రూ. 2500 నుండి 5000 వరకు పెంచడం హర్షణీయం. సీఎం కేసీఆర్ హిందూసనాత ధర్మాలను పాటిస్తూ సంస్కృ తి, సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నారు. వీటన్నింటిని కాపాడే బ్రాహ్మణ సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం. హిందూధర్మాన్ని పరిరక్షించడం కోసం గోపన్పల్లిలో 9 ఎకరాలు కేటాయించి రూ.12 కోట్ల వ్యయంతో విప్రహిత బ్రాహ్మణ సదన్ నిర్మించడం కేసీఆర్కే సాధ్యమైంది. మునుపెన్నడూ దేశంలో మరే నాయకుడు ఇలాంటి కార్యక్రమానికి చేపట్టలేదు. సర్వమతాలను సమదృష్టితో చూస్తున్న సీఎం కేసీఆర్కు మరెవరూ సాటి రాలేరు. ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం.
-చామరాజు శంకరాశాస్త్రి, అర్చకులు డీపీ కాలనీ
ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ సదన్ నిర్మించి చరిత్ర సృష్టించాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బ్రాహ్మణ భవన్ నిర్మించి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నాడని చెప్పడానికి ఇదే నిదర్శనం. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు అనేక నిధులు కేటాయించి బ్రాహ్మణులు అభివృద్ధి చెందేలా ఆర్థిక సహాయాలు అందిస్తున్నాడు. హిందూ ధార్మిక పరిరక్షణకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నది ముఖ్యమంత్రి కేసీఆరే. దేవాలయాల అభివృద్ధికి అనేక నిధులు మంజూరు చేస్తూ అనేక దేవాలయాలను పునర్నిర్మిస్తున్న ఆయనకు శుభాభినందనలు.
– సంకేపల్లి సుధాకర్శర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు