హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ) : కొవిడ్ బాధిత కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని హైదరాబాద్లో రెండు రోజుల పాటు జరిగిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసింది. దేశ వ్యాప్తంగా కొవిడ్ బారినపడి మృతిచెందిన దాదాపు 600 మంది కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని, ఈ ఏడాది వివిధ రాష్ట్రాల్లో హత్యలకు గురైన ఐదుగురు జర్నలిస్టుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసింది. ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ సి.కె.ప్రసాద్ నియంతృత్వ, చట్ట వ్యతిరేక చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జాతీయ యూనియన్లకు 14వ కౌన్సిల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసిన జస్టిస్ ప్రసాద్ చర్యలపై న్యాయపోరాటం సాగించాలని తీర్మానించింది.
దేశంలో జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై సంఘ వ్యతిరేక శక్తులు, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సాగిస్తున్న కక్ష్య సాధింపు చర్యలను సమావేశం తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియా రంగాన్ని బలహీనపరిచే చర్యలకు స్వస్తి పలకాలని పేర్కొంది. ఆదివారం జరిగిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పాత్రికేయులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించేలా కృషి చేస్తానని తెలిపారు.
ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్రెడ్డి, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్ రెడ్డి, దుబ్బాక ఎమ్యెల్యే రఘునందన్ రావు, ఐజేయూ మాజీ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, జాతీయ ప్రధాన కార్యదర్శి బల్విందర్ సింగ్, ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యుజే) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.