బంజారాహిల్స్: ఓఎల్ఎక్స్లో సోఫా విక్రయించేందుకు ప్రకటన ఇచ్చిన వ్యక్తిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ చెక్పోస్ట్ సమీపంలో నివాసం ఉంటున్న బీవీఎస్.భాస్కర్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
తన వద్ద ఉన్న పాత సోఫాను అమ్మేందుకు ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. దాంతో గుర్తు తెలియని వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి తాను సోఫా కొనుగోలు చేస్తానని. పేమెంట్ చేసేందుకు క్యూఆర్ కోడ్ను పంపిస్తున్నానని, దాన్ని క్లిక్ చేస్తే డబ్బులు పంపిస్తానని నమ్మబలికాడు.
దీంతో అతడు చెప్పిన ప్రకారం చేయగా రూ.13వేల చొప్పున రెండుసార్లు బ్యాంకు ఖాతానుంచి మాయమయ్యాయి. దీంతో బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వగా సైబర్ నేరగాళ్లు కాజేసి ఉంటారని చెప్పారు. ఈ మేరకు బాధితుడు మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.