Bonala Jathara | నల్లటి మబ్బులతో ఆకాశం గర్జిస్తూ ఉంటే..ఆషాఢం వచ్చినట్టే. ఆధ్యాత్మికతకు తొలిమాసంగా భావించే ఈ ఆషాఢ మాసం హైదరాబాద్ నగరానికి మాత్రం మరీ ప్రత్యేకం. అనుకోని విపత్తుల నుంచి తమను కాపాడాలంటూ ఆదిశక్తి రూపాలకు బోనాలు సమర్పించి వేడుకోవడం నగరంలో 4 శతాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్నది. వచ్చే సోమవారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలోనే ఈ నెల 22 (గురువారం) నుంచి జూలై 20 వరకు బోనాల ఉత్సవం హోరెత్తనున్నది. తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తారు. జూలై 16న లాల్దర్వాజ సింహవాహినికి తుదిబోనం సమర్పించనున్నారు. జూలై 20న గోల్కొండలో తొమ్మిదో పూజతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం 15 కోట్లు ఇప్పటికే కేటాయించింది. బోనాల సందర్భంగా ప్రభుత్వం 26 దేవాలయాలకు పట్టువస్త్రాలు సమర్పించనుంది.
మెహిదీపట్నం జూన్ 22 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గోల్కొండ కోట బోనాలకు ప్రపంచ ప్రఖ్యాతిని తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. చరిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢ మాసం ప్రారంభం రోజున నగర వ్యాప్తంగా బోనాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 22న లంగర్హౌస్ చౌరస్తాలో తొలిపూజతో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభంకానున్నాయి. ప్రతి యేటా ప్రభుత్వం తరఫున తొలి పూజ రోజు దేవాదాయ, హోంశాఖ, సినిమాటోగ్రఫీ మంత్రులు హాజరై జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు బోర్డుకు పట్టువస్ర్తాలను లంగర్హౌస్ చౌరస్తాలో అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడ నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమై గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారికి ఆభరణాలను అందించడం, బోనాల సమర్పణ, తొట్టెల సమర్పణతో తొలిపూజ ముగుస్తుంది.
ప్రతి గురు, ఆదివారాల్లో 9 వారాల పాటు పూజలు నిర్విరామంగా కొనసాగుతాయి. ఇదిలా ఉండగా.. గోల్కొండ బంజారా దర్వాజ నుంచి గోల్కొండ బోనాల కులవృత్తుల వారి ఆధ్వర్యంలో సర్కార్ బోనం(నజర్ బోనం)ను అమ్మవారికి సమర్పిస్తారు. ఆషాఢ మాసం బోనాలు జూన్ 22న (గురువారం) తొలి పూజ, 25న (ఆదివారం) రెండో పూజ, 29న (గురువారం) మూడో పూజ, జూలై 2న (ఆదివారం) నాలుగో పూజ, జూలై 6న (గురువారం) ఐదో పూజ, జూలై 9న (ఆదివారం) ఆరో పూజ, జూలై 13న (గురువారం) ఏడో పూజ, జూలై 16న (ఆదివారం) ఎనిమిదో పూజ, జూలై 20న(గురువారం) తొమ్మిదో పూజతో బోనాలు ముగుస్తాయి. ఈ పూజలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. బోనాల పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వెయ్యిమంది పోలీసులతో భారీ బందోబస్తు, బోనాల పర్యవేక్షణకు 50 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు.
కార్వాన్, జూన్ 17: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకన ఆషాఢ మాసం బోనాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం సంప్రదాయబద్ధంగా కుమ్మరులకు ఆనవాయితీగా వస్తోంది. దీంతో ప్రతి యేటా జగదాంబిక అమ్మవారికి తొలి బోనం కుమ్మరులు సమర్పిస్తారు. ఈ సారి కూడా జూన్ 22న తెలంగాణ కుమ్మరులు గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అధ్వర్యంలో అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మరుల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొల్లురి అనిల్ కుమార్, కోశాధికారి దామ సత్యనారాయణ, వైస్ చైర్మన్ కె. శంకర్, దర్గా ఆనంద్ రావు, తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో గోల్కొండ కోటలో ఆషాఢ మాసం బోనాలు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. గోల్కొండ కోటకు ప్రభుత్వం అధికారికంగా రూ.10 లక్షలు ప్రకటించడం గొప్ప విషయం. ఇవి కాకుండా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కోట్ల రూపాయలు బోనాల కోసం ఖర్చవుతాయి. 9 వారాల పాటు బోనాలకు భక్తులు పెద్ద ఎత్తున రానున్నారు. అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
– ఠాకూర్ జీవన్సింగ్ ( కార్వాన్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి)
చరిత్రాత్మక గోల్కొండ కోటలో జరిగే ఆషాఢ మాసం బోనాలను ఘనంగా నిర్వహిస్తాం. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్నీ ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తాం. అధికారులు, నాయకులు, మైత్రి, పీస్ కమిటీ సభ్యులు, వలంటీర్ల సహాయసహకారాలతో బోనాలను 9 వారాల పాటు విజయవంతంగా నిర్వహిస్తాం.
-ఆరెళ్ల జగదీశ్ యాదవ్ (ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్)