సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ ద్వారాగాని లేదా ఇతర సైబర్ మోసాల ద్వారా గాని రూ.50వేలకు పైగా పోగొట్టుకున్నారా.. అయితే మీరు నేరుగా సైబర్క్రైమ్ ఠాణాలోనే ఫిర్యాదు చేయవచ్చు. అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. రూ.50వేల లోపు పోగొట్టుకుంటే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అక్కడే కేసు నమోదు చేస్తారు. గతంలో ఈ పరిధి రూ.లక్షా 50వేలు ఉండేది. పెరుగుతున్న ఆర్థిక సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని బాధితులకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతో ఈ నిబంధనలను మార్చుతున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. సైబర్క్రైమ్ స్టేషన్లో సంబంధిత సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కేసును దర్యాప్తు చేస్తారని చెప్పారు. సైబర్క్రైమ్కు సంబంధించిన ఇతర ఫిర్యాదులను స్థానిక పోలీసు స్టేషన్లలోనే దరఖాస్తు చేయాలని సూచించారు.