హైదరాబాద్ : విద్యాశాఖలో రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ) లను రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapalli Vinod Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మానసిక వైకల్యం (Mental disability) తో బాధపడుతున్న విద్యార్థులకు గత పది సంవత్సరాలుగా విద్యను ఐఈఆర్పీలు అందిస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో వీరిని రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నాలు జరిగాయని, అందుకు అవసరమైన పోస్టులను రెగ్యులర్ డీఎస్సీలో పొందుపర్చకుండా ఇతర ప్రక్రియ ప్రారంభమైందని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మెగా డీఎస్సీ వేయాలని చూస్తున్న తరుణంలో వీరిని రెగ్యులరైజ్(Regularized) చేయాలని సూచించారు.
ప్రస్తుతం సేవలందిస్తున్న 996 మంది ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేసి మిగిలిన పోస్టులను డీఎస్సీలో భర్తీ చేయాలని కోరారు. కాంట్రాక్టు విధానంలో పనిచేసిన జూనియర్ లెక్చరర్ (Junior Lecturers) , డిగ్రీ లెక్చరర్ లను రెగ్యులరైజ్ చేసినందున వీరిని కూడా రెగ్యులరైజ్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని ఆయన పేరొన్నారు. ప్రభుత్వంలో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు.