సిటీబ్యూరో, జనవరి 16 ( నమస్తే తెలంగాణ ) :నగరవాసుల్లో సైక్లింగ్పై అవగాహన పెంచడానికి హైదరాబాద్ సైక్లిస్టులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. కేవలం పిలుపునకే పరిమితం కాకుండా ఆచరణలోనూ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరంలో ఎక్కడికి వెళ్లినా సైకిల్నే వినియోగించే వారిని ప్రోత్సహించడానికి విభిన్న టాస్క్లతో వారిని సత్కరిస్తున్నారు. అనేక రకాల సైక్లింగ్ పోటీ లు నిర్వహించి వారికి ఉత్సాహానిస్తున్నారు. స్కూల్, ఆఫీస్లకు సైకిల్పైనే వెళ్లేవారిని గుర్తించి ప్రశంసా పత్రాలు ఇచ్చి, సైక్లింగ్ గ్రూప్లో సభ్యత్వం కూడా ఇస్తున్నారు
సైకిల్పైనే స్కూల్కు..
మేమిద్దరం అక్కాచెల్లెల్లం. మా పేర్లు ఎన్.ప్రణతి, సాహితి. మేము ప్రతి రోజు 12 కిలో మీటర్లు సైకిల్పైనే స్కూల్కు వెళ్తాం. సైక్లింగ్ అంటే మాకు చాలా ఇష్టం. మా పేరెంట్స్ బైక్పై వెళ్లాలని చెప్పినా మేము సైకిల్నే వినియోగిస్తాం. కాలుష్యం ఎక్కువైతే జరిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. మన అలవాట్లు మార్చుకుంటే కొంతైన భూ ప్రపంచానికి మేలు చేసినవాళ్లమవుతాం. అందుకే మేము సైకిల్ను ఎంచుకున్నాము. రేపటి మా భవిష్యత్కు ప్రకృతిని కాపాడుకుంటాం.
సైకిల్పైనే బ్యాంకుకు..
నేను కెనరా బ్యాంక్ ఉద్యోగిని. ఇంటి నుంచి ప్రతీ రోజు సైకిల్పైనే కార్యాలయానికి వెళుతాను. సైక్లింగ్ వినియోగం పెరగాలనేది నా లక్ష్యం. చాలా మంది బైక్ మీద వెళ్లు అని చెబుతుంటారు. కానీ సైకిల్ఎందుకు వినియోగించాలి అనేది నేను వారికి వివరిస్తుంటాను. ఒకప్పుడు సైకిల్ మన తొలివాహనం. చాలా మంది తమ పని ఒత్తిడిలో పడిపోయి సైకిల్ తొక్కడం మరిచిపోయారు. ఏదో జిమ్లలో సైక్లింగ్ పరికరాలను తొక్కుతూ వ్యాయామం చేశామనుకుంటున్నారు. కానీ సైకిల్ కేవలం ఆరోగ్యానికే కాదు.. సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగపడుతుంది.
ప్రతిరోజు ఆఫీస్కు..
సైక్లింగ్ను ప్రమోట్ చేయడంలో భాగంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే యూరోనిక్స్ కంపెనీ నగరానికి చెందిన తమ ఉద్యోగులకు సైకిళ్లను అందించింది. ప్రతీరోజు సైకిల్పైనే ఆఫీస్కు వచ్చేవారిని ప్రోత్సహిస్తుంది. కంపెనీ సౌత్ ఇండియా హెడ్ సాదిక్ సైకిల్ వినియోగం పెరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వివరించారు. ఈ కంపెనీ ఉద్యోగులు అందరూ సైకిల్పైనే ఇంటి నుంచి ఆఫీస్కు వెళుతుంటారు. “నేను చిన్నప్పుడు సైకిల్ తొక్కేదాన్ని. 12 ఏండ్ల అవుతుంది సైకిల్ తొక్కక. కానీ ఇప్పుడు మాకు కంపెనీ సైకిల్ అందించడంతో సైకిల్ తొక్కడం ప్రారంభించాను. చాలా సంతోషంగా ఉంది. మనం తొక్కే ఈ సైకిల్తో ప్రతీ రోజు నమోదయ్యే కాలుష్య వివరాల్లో కొంతనైనా తగ్గుతుంది.” అని ఉద్యోగి దివ్య చెప్పారు.
సైక్లింగ్ లీగ్ నిర్వహించాం
మేమే గతంలో అతిపెద్ద సైక్లింగ్ లీగ్ నిర్వహించాం. ఇందులో దేశవ్యాప్తంగా సైక్లిస్టులు పాల్గొన్నారు. నెల రోజుల వ్యవధిలో 2వేల కిలో మీటర్లకు మించి సైక్లింగ్ చేసిన టీంలను విజేతలుగా ప్రకటించి.. మొదటి టీంకు రూ.20వేల ప్రైజ్ మనీ, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10వేలు ప్రైజ్మనీ అందించాం. మిగిలిన వారిని అవార్డులతో సత్కరించాం. సైక్లింగ్ వినియోగం పెంచాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అందుకే మళ్లీ మేము మరో చాలెంజ్తో ముందుకొచ్చాం. కిడ్స్, అడల్ట్స్ సైక్లింగ్ చాలెంజ్ పోటీలు ప్రారంభించాం. సైక్లిస్టులను ప్రోత్సహించాలనేది దీని ఉద్దేశం. సైక్లింగ్తోనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.