సిటీబ్యూరో, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : పరిశోధనలకు సమాచారమే ముఖ్యమైనది. అలాంటి సమాచారమంతా ఒకే వేదికపై ఉంటే మరింత వేగంగా పరిశోధనల్లో పురోగతి సాధించే వీలుంటుంది. అలాంటి కార్యక్రమానికి ఇక్రిసాట్ శ్రీకారం చుట్టింది. టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ సంస్థతో కలిసి డేటాబేస్ను రూపొందిస్తోంది. దేశ ఆహార వ్యవస్థను అభివృద్ధి చేసేలా వ్యవసాయం, పోషకాహారం, పశు పోషణను సమీకృతం చేస్తూ డెవలప్ చేసింది. వెబ్ ఆధారిత డేటాబేస్ను సైంటిస్టులందరూ వినియోగించుకునేలా అందుబాటులోకి తీసుకువచ్చారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన సమాచారాన్ని క్రోడీకరించారు. ఇప్పటివరకు 1967-2017 సమాచారంతో డేటాబేస్ రూపొందించగా, తాజా సమాచారంతో కూడిన డేటాబేస్ను మళ్లీ అప్డేట్ చేసేందుకు ఇరు సంస్థలు కృషి చేస్తున్నాయి.
వ్యవసాయ ఆధారిత దేశంలో..
వ్యవసాయ రంగానికి పరిశోధనలే కీలకం. పరిశోధనలకు అవసరమైన సమాచార సేకరణ అత్యంత కఠినమైన ప్రక్రియ. దీంతో పరిశోధనల్లో జాప్యం జరిగే అవకాశం ఉండటంతోపాటు, కచ్చితమైన సమాచారం లేకపోవడంతో వాస్తవ ఫలితాలను అందుకునే పరిస్థితి ఉండదు. అలాంటి శాస్త్రీయ పరిశోధనలకు ఇబ్బందిగా మారిన సమాచార ఇబ్బందులను అధిగమించేందుకు ఇక్రిసాట్-టీసీఐ సంస్థలు అగ్రికల్చరల్, అనుబంధ రంగాలతో కూడిన డేటాబేస్ను రూపొందిస్తోంది.
జిల్లా సమాచారం ఒకే చోట..
ఇప్పటివరకు ఉన్న సమాచారంలో దేశంలోని 20 రాష్ర్టాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. ఆధునీకరించిన డేటాలో అదనంగా మరికొన్ని రాష్ర్టాలతోపాటు, ప్రతి జిల్లా యూనిట్గా డేటాబేస్ను ఆధునీకరిస్తున్నారు. ఇందులో జిల్లా సరిహద్దులు, నేల స్వరూపంతో 2020 నాటి సమాచారమే ఎక్కువగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 74 అంశాలు, 1030 రకాలపై సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
పాత డేటాకు మెరుగులు
సామాజిక,ఆర్థిక పరమైన అంశాలతోపాటు, పర్యావరణం, న్యూట్రిషన్, ఆరోగ్య సంబంధిత అంశాలతో 1967-2017వరకు కూడిన సమాచార నిధిని ఇప్పటికే రూపొందించారు. తాజాగా ఆ సమాచారాన్ని మరింత ఆప్డేట్ చేసేందుకు ఇరు సంస్థలు సిద్ధమయ్యాయి. ఫిషరీస్, ప్లాంటేషన్, పంటలు, అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను శాటిలైట్ ఇమేజింగ్ విధానం ద్వారా సేకరించిన నీటిపారుదల వ్యవస్థ, నేల నిర్వహణ వంటి అంశాలను జోడించి ఆప్డేట్ వెర్షన్తో డేటాబేస్ రూపొందించే ప్రక్రియ కొనసాగుతున్నది. దీనిని ప్రపంచంలోని వ్యవసాయ, అనుబంధ రంగాలపై అధ్యయనం చేసే అన్ని వ్యవస్థలు వినియోగించుకునేలా ఓపెన్ సోర్స్ డేటాను రూపొందించనున్నారు. దీని ద్వారా పర్యావరణ మార్పులు, పంటలపై ప్రభావం, దిగుబడి తగ్గడానికి గల కారణాలను విశ్లేషణతోపాటు, దిగుబడిని పెంచేలా అందుబాటులో విత్తన నిర్వహణకు వీలుగా ఈ సమాచార నిధిని అప్డేట్ చేస్తున్నారు.