MLA Mutha Gopal | హైదరాబాద్, ఆగస్టు 30 : గంగపుత్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన గంగపుత్ర వర్కింగ్ ఉమెన్స్ సమావేశం ఆదివారం తార్నాకలోని సత్యోదయ రిట్రీట్ మందిరంలో ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 200 మందికిపైగా గంగపుత్ర మహిళలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగపుత్రులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. గంగపుత్ర సమాజానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, ఆర్థికాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. పిల్లలను ఉన్నత విద్య చదివించి, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో గంగపుత్ర మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ తదితర సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది. మహిళలపై కొనసాగుతున్న వివక్షను అధిగమించేందుకు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని పలువురు వక్తలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా గంగపుత్ర వర్కింగ్ ఉమెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ దేశబోయిన రమాదేవిని, ప్రధాన కార్యదర్శిగా పంపరి మంగని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా 35 మంది కమిటీ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షురాలు డాక్టర్ దేశబోయిన రమాదేవి మాట్లాడుతూ.. గంగపుత్ర మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా సామాజిక వివక్షపై ఆందోళన వ్యక్తం చేశారు. గంగపుత్ర మహిళలందరూ ఐక్యంగా ఉంటే తమ సమస్యలపై సమర్థవంతంగా పోరాడే అవకాశం ఉంటుందని అన్నారు. గంగపుత్ర మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లను గంగపుత్ర విద్యార్థులు, ఉద్యోగులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై గంగపుత్ర మహిళలకు అవగాహన కల్పించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని అన్నారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకొని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఒక అవకాశంగా తీసుకొని, రాబోయే రోజుల్లో రాజకీయ రంగంలో మహిళలకు లభించే 33 శాతం ప్రాతినిధ్య అవకాశాలను గంగపుత్ర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు గంగపుత్ర మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని, గ్రామ సభల నుంచి శాసనసభ, పార్లమెంట్ వరకు గంగపుత్ర మహిళలు తమ గొంతును వినిపించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్షురాలిగా ఎన్నుకున్న సభ్యులందరికీ డాక్టర్ రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. గంగపుత్ర వర్కింగ్ ఉమెన్స్ అసోసియేషన్ అభివృద్ధికి తన పూర్తి సమయాన్ని కేటాయించి పనిచేస్తానని తెలిపారు.
ప్రధాన కార్యదర్శి పంపరి మంగ మాట్లాడుతూ.. గంగపుత్ర మహిళలందరూ ఐక్యంగా ఉన్నప్పుడే సమాజంలో తమకు తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని పేర్కొన్నారు. పరస్పర సహకారంతో గంగపుత్ర మహిళలందరూ అభివృద్ధి చెందాలని, ఇలాంటి సమావేశాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నిర్వహించి మహిళల్లో చైతన్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేసిన గంగపుత్ర మహిళలందరికీ ఆమె అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించిన గంగపుత్ర విద్యావంతుల వేదికకు, ప్రొఫెసర్ సరుగు సుదర్శన్ రావు గారికి, పూస మల్లేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ దేశబోయిన రఘు, పాక రవి ప్రసాద్, మహిళా సంఘం అధ్యక్షురాలు పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ , గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షులు పాక సృజన్ , శంకర్ , అక్కపల్లి ఉదయ్ కిరణ్ రు, డి. భాస్కర్ , భూపతి తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన కమిటీకి అభినందనలు తెలిపారు.
గంగపుత్ర మహిళల ఐక్యత, సాధికారత, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
Novak Djokovic: తొలి రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్.. యూఎస్ ఓపెన్లో ఏడ్చిన జోకోవిచ్
Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!
SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే