సిటీబ్యూరో, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): వైద్యుడికి పెట్టే ఖర్చు వంటవారికి పెట్టాలని ఘోషించినా..ఆరోగ్యకరమైన దేహంలోనే ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటాయని నిపుణులు నిర్ధారణలు చేసినా.. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దల అనుభవాలతో సెలవిచ్చినా మనిషి మనుగడలో ఆరోగ్యం ఎంతటి కీలక పోత్ర పోషిస్తుందో పై ఉదాహరణలు తేటతెల్లం చేస్తున్నాయి. ఒక దేశం అభివృద్ధి ఆ దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులపై ఆధారపడి ఉంటుందనేది కాదనలేని సత్యం. అందుకే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) ‘మై ప్లేట్’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నది. మీరు తినే పళ్లెంలో ఏమేమీ ఉండాలో ఓసారి తరిచి చూసుకోమని గుర్తు చేస్తున్నది.
మరి ఇంకేం మనం కూడా ఎన్ఐఎన్ సూచనలు పాటిద్దాం..రోజు వారి జీవితంలో సమతుల ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్య భారతావని నిర్మాణంలో మనమూ భాగస్వాములమవుదాం. జాతీయ పోషకాహార సంస్థ నివేదిక ప్రకారం సగటు మనిషికి కనీసం రోజుకు 1800 నుంచి 2వేల కేలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సమతుల ఆహారాన్ని సూచించే బియ్యం, పప్పులు, పాలు లేదా పెరుగు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు పండ్లు, గింజలు, నూనె పదార్థాలు ఉంటే గానీ శరీరానికి సరిపడానంత శక్తి, విటమిన్లు అందవని నిపుణులు అంటున్నారు.
అయితే దేశంలో 30శాతం లోపు జనాభా మాత్రమే పౌష్టికాహార విశిష్టత, ప్రాముఖ్యతను తెలుసుకుని పాటిస్తున్నారు. మిగిలిన 70శాతం జనాభాలో ఆహారపు అలవాట్లపై ఏ మాత్రం అవగాహన లేనివారు, నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మధ్య వయసులో ఉండే స్త్రీ, పురుషులెవరైనా రోజుకు కనీసం 1187 గ్రాముల ఆహారాన్ని తీసుకోవాలని, ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పులు, గింజలు, నెయ్యి, పెరుగు వంటివి ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అన్నం, చపాతీలు(200 గ్రా. ), పప్పులు(90గ్రా. మిల్క్ లేదా పెరుగు(300గ్రా), వెజిటేబుల్, ఆకుకూరలు(350గ్రా.), ఫ్రూట్స్(150గ్రా.), గింజలు(30గ్రా.), నెయ్యి లేదా నూనె(27గ్రా.) చొప్పున తీసుకుంటే శరీరానికి కావాల్సిన 2000 కిలో కేలరీల శక్తి అందుతుందని వైద్యులు చెబుతున్నారు.