సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రచనలు అంటే రసానుభూతి కోసం కాదు, కాలక్షేపం అంతకన్నా అసలే కాదని.. విశాల ప్రజా రాశుల సాదకబాధకాలే ఇరుసుగా చేసుకొని సామాజిక అంశాలపై రచయిత్రులు తమ కలాన్ని కదుపుతున్నారు. కవిత్వంతో చైతన్యం కలిగిస్తున్నారు. సోషల్ మీడియాను వేదికగా మలుచుకుని అద్భుతమైన కవిత్వం ఆవిష్కరిస్తున్నారు. విద్య, వైద్యం, రక్షణ, వేధింపుల పై సామాజిక అవగాహన కలిగించే సాహిత్యాన్ని పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు. ‘అక్షరయాన్ తెలుగు వుమెన్ రైటర్స్ ఫోరం’ ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కల్పించడంలో భాగంగా ‘పసి మొలకలు-రుధిరజ్వాలలు’ కవితాసంపుటి, ‘సముజ్వల భారతి’ త్యాగం విలువను చాటే ప్రచురణలు వచ్చాయి. సమాజంలో జరుగుతున్న దారుణాలు.. అందుకు పరిష్కారాలు.. విలువలు చాటిచెప్పే అక్షరాల సమాహారంతో కవయిత్రులు రచనలు చేశారు. సోషల్ మీడియా ద్వారా తమలో దాగి ఉన్న కవిత్వానికి పదునుపెట్టగలుగుతున్నామని చెబుతున్న రచయిత్రుల అభిప్రాయాల్ని వారి మాటల్లోనే విందాం.
మానవత్వానికి, మనిషి తత్వానికి ఒక అనుసంధాన సూత్రం కవిత్వం. మనం స్పందించాలనుకునే ప్రతి అంశంలోనూ సందేశం ఉండాలనేది నా అభిప్రాయం. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి గంటల పాటు చెప్పినా అర్థం కాని విషయం చిన్నచిన్న వ్యాఖ్యలతో పదునైన పదాలతో అర్థం చేయించగలిగే శక్తి కవిత్వానికి ఉంది. సమాజంలో జరుగుతున్న దారుణాలపై స్పందించాల్సిన అవసరం ఉంది. మహిళా రచయితలకు అక్షరయాన్ సంస్థ గొప్ప అవకాశాన్ని అందించింది. గృహిణులుగా ఇంటికే పరిమితమైన చాలా మందిని తమలోని కవితాశక్తికి మళ్లీ జీవం పోసేలా చేసింది. ఈ ప్రక్రియలో సోషల్ మీడియా పాత్ర ఎనలేనది.
రచయితలు సమాజంలో ఒక గురుతర బాధ్యతను పోషించాలి. సమకాలీన సమస్యలపై స్పందించడం ,ప్రజలను అప్రమత్తం చేయడం వారి బాధ్యత. పసిపిల్లలపై అత్యాచారాలు మనసుని కలిచి వేస్తున్నాయి. విలువలు కోల్పోయి దేశం పట్ల భక్తి భావన లేక యువత గతితప్పి చెడు అలవాట్లకు బానిసలై దేశానికి తలవంపులు తెచ్చేలా తయారవుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని అక్షరయాన్ రచయిత్రులు పసిమొలకలు రుధిర జ్వాలలు అనే పుస్తకం ద్వారా కవయిత్రుల ఆవేదనకు అక్షరరూపం ఇచ్చారు.
-డా. సమ్మెట విజయ, రచయిత్రి.
గన్ను కన్నా కలం శక్తివంతమైనది. ఉపాధ్యాయుని పెన్ను గదిలోని విద్యార్థులను తీర్చిదిద్దగలిగితే.. బయట సమాజాన్ని మార్చగలిగే శక్తి కవులు, రచయితలకు ఉంది. సమాజంలోని రుగ్మతలను రూపుమాపాలన్నా ప్రజలలో దేశభక్తిని నింపాలన్నా.. చరిత్రపుటలు తిరగేయాలన్నా.. దేశ రక్షణలో అసువులు బాసిన వీరుల త్యాగాలు గుర్తు చేయాలన్నా
ఆ శక్తి ఒక్క అక్షరానికే ఉంటుంది.
– గాలి లలిత ప్రవళిక
సమాజంలో చైతన్యం కలిగించే బాధ్యత ప్రతి కలానికి ఉంటుంది. అందరు రచయితలు ఆ బాధ్యతను స్వీకరించాలి. రేపటి తరాన్ని సృష్టించే ఆడవారిపై దేశంలో అఘాయిత్యాలు జరగడం దారుణం. చిన్నారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ప్రతి పౌరుడు పోలీస్ బాధ్యతను నిర్వర్తించాలి. మేం సామాజిక బాధ్యతగా రెండు పుస్తకాలు తీసుకొస్తున్నాం. 365 మంది కవయిత్రులతో ‘పసిమొలకలు-రుధిర జ్వాలలు’ పూర్తి చేశాం. దేశభక్తి, మాతృదేశం, మాతృభూమి, మాతృభాషను ఎప్పటికి మరిచిపోవద్దనే సందేశంతో ‘సముజ్వల భారతి’ని తీసుకొచ్చాం. పరమవీర చక్రను పొందిన వారి త్యాగాలను అందులో పరిచయం చేశాం. సోషల్ మీడియా వేదికగా చాలా మంది రచయితలు తమ ప్రతిభను వెలికితీస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం.
సమున్నత భారతదేశంలో గల చీకటి కోణాలు వెలుగులు చూడాలంటే ముందుగా స్త్రీలు గౌరవింపబడాలనే ఆశయంతో పసిమొలకలుగా వసివాడి పోతున్న వారి ఘోషను రాళ్లు కరిగే విధంగా మహిళలు తమ కలాలలో రుధిరాశ్రువులను నింపి రాసిన కవితలు రాశారు. చదివిన మానవమృగాలు మనుషులుగా, మనీషులుగా మారతారని ఆశతో మరెన్నో కోణాలు వెలికి తీసే బృహత్తర ప్రయత్నాలు చేశాం.
– చివుకుల శ్రీలక్ష్మి, కవయిత్రి
మనిషి తన మాటని ఒకానొక సమయంలో తూటాగా.. మరొక సమయంలో బాధని తగ్గించే లేపనంగా ఉపయోగిస్తాడు. రచయిత ఆ అక్షరాలలో మేలైనా భావపూరిత విత్తనాలని తన మస్తిషంలో అలికి, సమాజానికి ఆరోగ్యకరమైనా, నాణ్యమైనా., భావఫలాలనిచ్చే పంటని వర్ధమాన, భవిష్యత్ తరాలకోసం అందించేందుకు అనునిత్యం శ్రమిస్తాడు. ఆరోగ్యకర సమాజనిర్మాణానికై పునాదులు వేయాల్సిన అవసరం ఉంది.