సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): నో ఎంట్రీ సమయాల్లో రోడ్లపై తిరగాలంటే ప్రత్యేక అనుమతి పొందిన భారీ వాహనాలకు ‘మై ట్రాన్స్పోర్ట్ ఈజ్ సేఫ్’ అనే స్టిక్కర్ తప్పనిసరి అని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కమిషనరేట్లో కన్స్ట్రక్షన్ వాహనాలు, ఆర్ఎంసీ, ప్రైవేటు బస్సులు, స్కూల్ బస్సుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో భారీ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘మై ట్రాన్స్పోర్ట్ ఈజ్ సేఫ్’ యాప్ను డీసీపీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాల రద్దీ, రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకొని అవసరమైన వాహనాలకు కొన్ని ప్రత్యేక రూట్లలోనే అనుమతి తీసుకోవాలని సూచించారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ, వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాహనాల కోసం ‘మై ట్రాన్స్పోర్ట్ ఈజ్ సేఫ్’ అనే అప్లికేషన్ ద్వారా ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను రూపొందించినట్లు తెలిపారు.
నో ఎంట్రీ సమయాల్లో ప్రత్యేక అనుమతి కలిగిన భారీ వాహనాలకు ఈ స్టిక్కర్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాలకు ఉదయం 7.30 నుంచి 11.30 గంటల వరకు సాయంత్రం 4 నుంచి 10.30 గంటల వరకు అనుమతి లేదన్నారు. ప్రత్యేక కారణాల దృష్ట్యా భారీ వాహనాలను నో ఎంట్రీ సమయాల్లో తిప్పాలంటే అందుకోసం సైబరాబాద్ పోలీసు కమిషనర్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి పొందిన వాహనాలకు ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను జారీ చేస్తామన్నారు. ఈ క్యూర్ కోడ్లో వాహనానికి సంబంధించిన వివరాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ శ్రీనివాస్రెడ్డి, ఏసీపీ హనుమంతరావు, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.