దుండిగల్, నవంబర్ 18 : అవకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బాచుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం సమీపంలో రూ.17 కోట్ల సీఎస్ఆర్ నిధులతో హెచ్ఏఎల్ సంస్థ సహకారంతో సాంఘిక సంక్షేమ గురుకుల(టీఎస్డబ్ల్యూర్) పాఠశాల, మహిళా డిగ్రీ కళాశాల భవనాలకు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద్తో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ… వెనుకబడిన ప్రాంతాల్లో పేదవారికి ఉపయోగపడే విధంగా సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేందుకు హెచ్ఏఎల్ సంస్థ ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి దాకా గురుకుల పాఠశాలల్లో చేరేందుకు 1.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 40వేల సీట్లను భర్తీ చేశామని తెలిపారు. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో విద్య నభ్యసిస్తున్న విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ వెయ్యి గురుకుల పాఠశాలలను అందుబాటులోకి తీసుకొచ్చారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గురుకుల పాఠశాల, కళాశాలల నిర్మాణానికి రూ.17కోట్లు నిధులు అందిస్తున్న హెచ్ఏఎల్ యాజమాన్యానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ మాట్లాడుతూ… గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యనందిస్తున్నామని తెలిపారు.
ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలను బాలికలు, యువతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నరసింహా రెడ్డి, బాచుపల్లి తాసీల్దార్ సురేందర్, హెచ్ఏఎల్ డైరెక్టర్ అలోక్ వర్మ, హెచ్ఏఎల్ జీఎం అరుణ్ జే సర్కాటే, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డితో పాటు డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు , కో-ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.