సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీ విద్యా సంబంధ అంశాలతో పాటు హాస్టల్ సదుపాయాలకు సమప్రాధాన్యత ఇస్తుంది. అందుకోసం యూనివర్సిటీ క్యాంపస్లో చదువుతున్న విద్యార్థులందరికీ హాస్టల్ సదుపాయం కల్పించడమే లక్ష్యంగా యూనివర్సిటీలో మరో నూతన హాస్టల్ నిర్మాణం చేపడుతున్నారు. అందుకోసం రూ.39.50 కోట్లు కేటాయించారు.
క్యాంపస్లో 500 మంది విద్యార్థులు ఒకే భవనంలో ఉండే విధంగా డిజైన్ నిర్ణయించారు. జీ+3 అంతస్తులతో దీనిని నిర్మిస్తున్నారు. హాస్టల్ భవనం నిర్మించడంతో పాటు ఇంటర్నల్ వాటర్ సదుపాయం, శానిటరీ విధానం ఏర్పాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నల్ ఎలక్ట్రికల్ను ఇన్స్టాల్ చేయనున్నారు. ఈ భవన నిర్మాణ బాధ్యతలు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) అప్పగించినట్లు ఓయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్యాదవ్ తెలిపారు.
అయితే ‘మన ఊరు- మన యూనివర్సిటీ’ లో భాగంగా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. మొత్తం ఐదు అంతస్థులతో నిర్మిస్తున్న ఈ నూతన భవనం 10049 స్కేర్ మీటర్లతో 170 రూమ్లు నిర్మిస్తున్నట్లు వీసీ తెలిపారు. ఈ హాస్టల్ నిర్మాణం కోసం శనివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
ఓయూ క్యాంపస్ విద్యార్థుల కోసం కొత్తగా నిర్మిస్తున్న హాస్టల్ భవనం కోసం ఓయూ పూర్వ విద్యార్థులు ముందుకు రావాలి. వారి భాగస్వామ్యంతో భవన నిర్మాణం చేపట్టినట్లయితే హాస్టల్ భవనానికి పూర్వ విద్యార్థుల పేరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే యూనివర్సిటీ అభివృద్ధి అంశం, నిధులు సమీకరణ, అకాడమిక్ సంబంధ అంశాలపై సహాయ సహకారాలు పొందడం కోసం పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు కూడా నిర్వహించాం.
వచ్చే జనవరిలో కూడా మరో దఫా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసి, యూనివర్సిటీ అభివృద్ధి కోసం ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తాం. కొనసాగింపుగా.. క్యాంపస్ విద్యార్థుల కోసం.. పూర్వ విద్యార్థుల నుంచి నిధులు సమీకరించడం కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.