మేడ్చల్, నవంబర్13(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జోరుగా వరి ధాన్యం కొనుగోలు జరుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 23 వేల 542 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు గాను రూ. కోటి 61 లక్షలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. జిల్లాలోని మాదారం, ఏదులాబాద్, ప్రతాపసింగారం, లక్ష్మాపూర్, కేశవరం, ఉద్దమర్రి, కీసర, మేడ్చల్, డబిల్ఫూర్, పూడూర్, శామీర్పేట్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల్లో నగదును ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా 2,656 రైతులు ఉండగా ఇప్పటి వరకు 341 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్ తెలిపారు. వానాకాలం పంట సాగులో 18 వేల ఎకరాల్లో సాగు చేసిన వరి 45 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్న అంచనా మేరకు కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ధాన్యాన్ని విక్రయించే రైతులు పట్టాదారు పాసుబుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు తీసుకురావాలని సూచిస్తున్నారు.
వరి కొతలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతున్నది. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే వరకు కొనుగోలు కేంద్రాల కొనసాగించనున్నారు. వచ్చే నెల చివరి వారం వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మొదటి రకం ధాన్యానికి రూ. 2060, సాధారణ రకానికి రూ. 2040 మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తుంది.