చాంద్రాయణగుట్ట,జనవరి 21: తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు శుక్రవారం మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో పురానాపూల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు.కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో జనంలో అవగాహన తీసుకురావడంతో పాటు ఎలాంటి లక్షణాలు ఉన్నాయో పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే తేల్చడంతో జనంలో కూడా భరోసా కలుగుతుంది. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉంటే ఎన్ని రో జుల నుంచి ఆరోగ్యం బాగోలేదు…ఎక్కడైనా వైద్య పరీక్షలు చేయించుకున్నారా.. చేయించుకుంటే ఎలాంటి మందులు వాడారు అనే విషయాలను వైద్య సిబ్బంది తెలుసుకొని హోం ఐసొలేషన్ కిట్లను అందజేస్తున్నారు. ఇంట్లో వారికి ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యం కలిగితే వైద్యశాలకు వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:పట్టణ ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ శ్రీకాంత్
ప్రజలు కరోనా, ఒమిక్రాన్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, వైద్యులు సూచించిన సూచనలను పాటించాలని కార్వాన్ పట్టణ ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కార్వాన్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు 100-120 మందికి కరోనా టెస్టులు నిర్వహించడంతో పాటు పాజిటివ్ వచ్చినవారికి కరోనా కిట్లు అందజేస్తున్నామన్నారు. ప్రతి రోజు 40-45 మందికి పాజిటివ్గా వస్తున్నందున ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. అనవసరంగా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని అన్నారు. శుక్రవారం 120 మందికి టెస్టులు నిర్వహిస్తే 26 మందికి కరోనా పాజిటివ్ తేలిందన్నారు.