ఎర్రగడ్డ, నవంబర్ 9: బోరబండలో మరో బస్తీ దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. డివిజన్లోని వీకర్సెక్షన్ దేవయ్య బస్తీ కమ్యూనిటీహాల్లో ఈ దవాఖాన ఏర్పాటు కానున్నది. దీంతో బోరబండలో సర్కారు దవాఖానల సంఖ్య నాలుగుకు చేరుతుంది. ఇప్పటికే సైట్-3 పీలీదర్గా సమీపంలో, స్వరాజ్నగర్లో ఒక్కోటి చొప్పున పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొనసాగుతున్నాయి. బోరబండ బస్టాప్ సమీపంలోని వినాయకరావునగర్ కమ్యూనిటీహాల్లో బస్తీ దవాఖాన అందుబాటులో ఉన్నది.
ఐతే తాజాగా దేవయ్య బస్తీ కమ్యూనిటీహాల్లో నెలకొల్పనున్న బస్తీ దవాఖానను త్వరలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ కమ్యూనిటీహాల్ ప్రాంగణంలో అంగన్వాడీ కేంద్రం, మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం కొనసాగుతున్నాయి. బస్తీ దవాఖానను ఏర్పాటు చేయనున్న బ్లాకునకు రంగులు వేసే పనిని పూర్తి చేశారు.
బోరబండ డివిజన్ వీకర్సెక్షన్లోని 30 బస్తీలతో పాటు అతి చేరువలో ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నవభారత్నగర్ వాసులకు ఈ దవాఖాన అందుబాటులోకి రానున్నది. బోరబండలో ఇప్పటికే కొనసాగుతున్న సర్కారు దవాఖానలకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. ఒక్కో దవాఖానలో రోజుకు 150-200 మంది చొప్పున వైద్య సేవలను పొందుతున్నారు. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండటంతో పాటు వివిధ పరీక్షలు ఉచితంగా లభించటమే దీనికి కారణం. వైద్యులు, సిబ్బంది, ఆశ వర్కర్లు సమన్వయంతో పని చేస్తూ రోగులకు సకాలంలో వైద్య సేవలు అందేవిధంగా చేస్తున్నారు. దేవయ్య బస్తీకి బస్తీ దవాఖాన త్వరగా రానున్న నేపథ్యంలో వీకర్సెక్షన్ బస్తీల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.