Ganesh Laddu Auction | సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : నగరంలో గణపతి లడ్డూ వేలం అదరహో అన్నట్లుగా సాగింది. గల్లీ నుంచి మొదలుకుంటే బడా గణేశుడి వరకు లడ్డూ దక్కించుకునేందుకు పోటాపోటీగా పాల్గొన్నారు. నవరాత్రుల కంటే చివరి రోజున జరిగే లడ్డూ వేలం నిర్వహణకు ప్రత్యేక ఆకర్షణ ఉండగా… ఏటా గణేశుడి లడ్డూలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. బండ్లగూడ జాగీర్ సమీపంలో ఉండే రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన లడ్డూ వేలంలో రూ.కోటి 26లక్షలు పలికింది. గతేడాది కంటే రెండింతలు రేటుతో లంబోధరుడి లడ్డూను దక్కించుకున్నారు.
ఒకప్పుడు బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం అంటేనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉండేది. ఇప్పటికీ అదే తీరుగా వేలంను నిర్వహిస్తున్నప్పటికీ… నగరంలోని పలు గణేశ్ మండపాల వద్ద అంతకు మించిన ధరలకు లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు. బాలాపూర్ లడ్డూకు గట్టి పోటీనిస్తూ సరికొత్త రికార్డులు ఏటా బండ్లగూడ జాగీర్లోని సన్సిటీ రిచ్మండ్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ నెలకొల్పుతున్నది. తాజాగా నిర్వహించిన లడ్డూ వేలంలో రూ. కోటి 26లక్షలకు లడ్డూలను దక్కించుకున్నారు. గతేడాదిలో నిర్వహించిన లడ్డూ వేలంలో రూ. 65లక్షలకు అమ్ముడుపోగా… ఈసారి రెండింతలు ధర పలికింది. ఈసారి లడ్డూ వేలంలో వచ్చిన డబ్బులను సామాజిక కార్యక్రమాల్లో వినియోగించనున్నట్లు తెలిసింది.
గ్రేటర్ వ్యాప్తంగా 95వేలకు పైగా గణేశ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. నిర్వాహకులు దశల వారీగా నిమజ్జనం నిర్వహిస్తూనే ఉన్నారు. నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో లడ్డూ వేలాలు భారీగా జరిగాయి. ఈ క్రమంలో గల్లీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు, కాలనీ గణేశుడి మండపాల వద్ద నిర్వాహకులు అట్టహాసంగా వేలం ప్రక్రియను చేపట్టారు.
బడంగ్పేట, సెప్టెంబర్ 28: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ పాటిగూడ గ్రామానికి చెందిన రియల్టర్ దాసరి దయానంద్ రెడ్డి బాలాపూర్ గణనాథుని లడ్డూను వేలంలో రూ.27లక్షలకు దక్కించుకున్నారు. 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్ గణనాథుని లడ్డూ 2023 నాటికి రూ.27లక్షల రికార్డు స్థాయి ధర పలికింది. వేలంలో పాల్గొనడానికి వచ్చిన 36 మంది పేర్లు ఉన్న జాబితాను ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి చదివి 10.40 గంటలకు వేలంను ప్రారంభించారు. 15 నిమిషాల పాటు వేలం కొనసాగింది. వేలంలో రూ. 27లక్షలకు దాసరి దయానంద్రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.24.60 లక్షలకు బాలాపూర్కు చెందిన ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకోగా… ఈ సారి రూ. 2.40లక్షలు ధర పెరిగింది.
ఉదయం 5 గంటలకు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ గణనాథుడికి చివరి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు చేవెళ్ల ఎంపీ జి.రంజిత్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం గణేశ్ శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్రలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గణేశ్ ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మేయర్ పారిజాత నర్సింహా రెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, కార్పొరేటర్లు, పోలీస్ అధికారులు, వివిధ పార్టీల నాయకులు, ఉత్సవ సమితి నాయకులు తదితులు పాల్గొన్నారు.
మాదాపూర్లోని సాయినగర్లో సాయి నగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను వేలంలో రూ. 23 లక్షలకు దక్కించుకున్న ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్ చౌదరిచౌదరి
బడంగ్పేటలో వీరాంజనేయ భక్త సమాజం అధ్యక్షుడు లోకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూను పెద్ద బావి వెంకట్ రెడ్డి రూ.17లక్షలకు దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ.14లక్షలు పలికింది. ఈ ఏడాది మూడు లక్షలు ఎక్కువ.
అత్తాపూర్ న్యూస్టార్ భక్త సమాజం ఆధ్వర్యంలోని గణేశ్ లడ్డూ రూ.10.11 లక్షలు పలుకగా అత్తాపూర్కు చెందిన గుమ్మడి భూపాల్రెడ్డి దక్కించుకున్నారు.