ఆల్ఇండియా 214 ర్యాంకర్ సస్యరెడ్డికి సన్మానం
సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): తండ్రి లేని లోటు.. ఆర్థిక కష్టాలు ఎదురైనా.. కుంగిపోలేదు…తల్లి ఆశీర్వాదం.. ఆమె ఇచ్చిన కొండంత ధైర్యంతో సివిల్స్లో సత్తాచాటారు జనగామ జిల్లాకు చెందిన సస్యరెడ్డి. కుటుంబంతో కలిసి దుండిగల్ గండిమైసమ్మలో అద్దెకు ఉంటున్న ఆమె.. బీటెక్ నాలుగో సంవత్సరం నుంచే సివిల్స్కు శ్రీకారం చుట్టారు. మూడు సార్లు పరీక్షలు రాసినా.. లక్ష్యం చేరలేదు.. అయినా.. ఎన్నడూ నిరుత్సాహ పడలేదు. ఆన్లైన్ ఉద్యోగం చేసుకుంటూనే.. ఎలాగైనా సివిల్స్ విజేతగా నిలవాలనే పట్టుదలతో తొమ్మిది గంటల పాటు కష్టపడ్డారు.
ఆన్లైన్, యూట్యూబ్ వీడియాల ద్వారా ప్రిపేర్ అయ్యారు. విజేతల బుక్ లిస్టులను కొనుగోలు చేసి.. ఇంట్లోనే చదువుకొని.. ఆల్ఇండియా 214 ర్యాంక్ను సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆమెను నేరేడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ సన్మానించి..అభినందించారు.