కరోనా కట్టడికి ఓ వైపు ప్రయత్నిస్తూనే మరో వైపు కరోనాతో బాధపడుతున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు నగర పోలీసులు తమ వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. దవాఖానలు, అందులో ఉన్న పడకలు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్న దవాఖానలు, వెంటిలేటర్లకు సంబంధించిన సమాచారంతో పాటు అంబులెన్స్ల సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రారంభించిన హెల్ప్ డెస్క్లు ఎంతో సహకరిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, వైద్య విభాగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సేవలు అందజేస్తున్నారు. కరోనాకు సంబంధించిన సేవలు.. ఎన్ఫోర్స్మెంట్ అంశాలపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్తో ‘నమస్తే తెలంగాణ’ తో విషయాలు వెల్లడించారు.
కరోనా బారిన పడినవారు దవాఖానల్లో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో వారి బంధువులు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు దవాఖానల వద్దకు చేరుకుంటున్నారు. లోపలికి వెళ్లలేక, తమ వారి యోగక్షేమాలు తెలువక దవాఖాన వద్దే పడిగాపులు కాస్తూ.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి సమస్యను పరిష్కరించేందుకు ఆయా వైద్యశాలల సూపరింటెండెంట్లు, డైరెక్టర్లతో కలిసి హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయించాం. ఇందులో వైద్యశాఖ సహకారంతో ఆయా దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారి సమాచారం వైద్యుల ద్వారా అక్కడుండే పోలీసులు చేరవేస్తున్నారు. గాంధీ, కింగ్ కోఠి, నిమ్స్ వంటి ప్రధాన దవాఖానల్లో హెల్డెస్క్లు పనిచేస్తున్నాయి.
గాంధీ, కింగ్ కోఠి, నిమ్స్ వంటి ప్రధాన దవాఖానల్లో ఏర్పాటు చేసిన హెల్డెస్క్లకు ఫోన్ చేస్తే ఆయా దవాఖానల్లో ఖాళీగా ఉన్న పడకలకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. వైద్య విభాగం నుంచి షిఫ్ట్ల వారీగా బెడ్లు ఎన్ని ఖాళీ అయ్యాయనే సమాచారం హెల్ప్డెస్క్కు చేరవేస్తుంటారు. దీనికి బెడ్మేనేజ్మెంట్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతున్నది. హెల్ప్డెస్క్కు వచ్చిన సమాచారాన్ని అక్కడుండే పోలీసులు ప్రజలకు తెలుపుతున్నారు. అందులో ఆక్సిజన్, వెంటిలేటర్లతో ఉన్న బెడ్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయనే సమాచారాన్ని హెల్ప్డెస్క్ను ఆశ్రయించిన వారికి తెలయపరుస్తున్నారు. దీంతో పాటు నగర పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ కేంద్రం ప్రత్యేకంగా పనిచేస్తున్నది. దీని ద్వారా కూడా ప్రజలకు అవసరమైన సమాచారం ఇస్తున్నారు. సామాన్య ప్రజలు ఆయా సహాయ కేంద్రాల్లో అంబులెన్స్లకు సంబంధించిన సమాచారం కోరితే అందిస్తున్నారు.
వారం కిందటి వరకు దవాఖానల వద్దకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. దవాఖానల్లో వైద్యసేవలు అందించడంలో వైద్యులు, వైద్య సిబ్బంది బిజీగా ఉంటారు. అక్కడకు వచ్చిపోయే వారికి సమాచారం ఇవ్వడం, సేవలు అందించడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ఇందుకు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయడంతో పాటు గాంధీ లాంటి వైద్యశాలలో ప్రతి ఫ్లోర్కు ఒక ఎస్సైస్థాయి అధికారిని ఇన్చార్జిగా పెట్టాం. ఒక్కో విభాగం వద్ద ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగించడంతో దవాఖానల వద్ద ప్రజలకు ఏమి కావాలన్నా.. పక్కా సమాచారం అందుతున్నది. దీంతో ఎవరు కూడా గబార పడటం లేదు. దవాఖానలకు రాకుండానే ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేయడంతో దవాఖాన సిబ్బందిపై కూడా ఒత్తిడి తగ్గింది. వేగంగా వైద్య సేవలు అందించడంపై వైద్యులు దృష్టి పెడుతున్నారు. వారికి సిటీ పోలీస్ తరపున సెల్యూట్ చేస్తున్నాం.
కరోనా కట్టడికి పక్కాగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం. మాస్క్లు పెట్టకుండా.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 16,421 ఈ పెటీ కేసులు, 77,856 ఈ చాలన్లు జారీ చేశాం. సోషల్ డిస్టెన్స్ పాటించని 3500 మందిపై కేసులు, ఎక్కువ మంది గుమిగూడి ఉండటంతో 555, రాత్రి వేళల్లో కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 5955 కేసులు నమోదు చేశాం. నెల రోజులుగా ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 1,05,540 కేసులు నమోదు చేశాం.
కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను డిస్పోజ్ చేసేందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వైద్య, జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులతో ఒక బృందం ఉంటుంది. నగర పోలీస్ కమిషనరేట్ తరపున గాంధీ దవాఖానలో అదనపు డీసీపీ స్థాయి అధికారి నోడల్ అధికారిగా ఉన్నారు. దవాఖానలో మృతి చెందిన వారి సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడంతో పాటు వారు స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా తెలుపుతున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం.
గాంధీ దవాఖానతో పాటు నగరంలో పలు చోట్ల పోలీస్ శాఖకు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగానే కరోనాతో బాధపడుతున్న వారికి ఆహారం, ఇతరత్రా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. 24 గంటలు పోలీసులు విధులు నిర్వహిస్తూ మేమున్నామనే భరోసాను కల్పిస్తున్నాం.