హైదరాబాద్ : హైదరాబాద్ పోలీసులపై కరోనా పంజా విసిరింది. ప్రతి పోలీసు స్టేషన్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఎస్ఐలతో పాటు కానిస్టేబుల్స్ కరోనా బారిన పడుతున్నారు. సీసీఎస్, సైబర్ క్రైమ్లో పని చేస్తున్న 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్కు వెళ్లి వచ్చింది. అందులో ఒక ఎస్ఐకి కరోనా సోకింది. ఆయన నుంచి మిగతా వారందరికీ కరోనా సోకినట్లు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఇక హయత్నగర్ పోలీసు స్టేషన్లో ఎస్ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం పోలీసు స్టేషన్ల పరిధిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నార్సింగి పోలీసు స్టేషన్లోనూ 20 మందికి పాజిటివ్ వచ్చింది.
ఈ క్రమంలో కరోనా సోకిన పోలీసులు అందరూ ఇప్పుడు హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. కరోనా కేసుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ల వద్ద అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఫిర్యాదుదారుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లోకి ఎవ్వరినీ అనుమతించడంలేదు. ఫిర్యాదు దారుల కోసం పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు. ఆ టెంటు కిందనే వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ముఖాలకు మాస్క్ ధరించని వారిని టెంటు కిందకు కూడా రానివ్వడంలేదు. మాస్కులు ధరించిన వచ్చిన వారు కూడా సామాజిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు.