జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు తెలంగాణ పోలీసులు రౌడీషీటర్లపై చర్యలు తీసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ను పోలీసులు బైండోవర్ చేశారు. మరో వంద మంది రౌడీ షీటర్లను సైతం బైండోవర్ చేశారు. మధురా నగర్ పీఎస్లో చిన్న శ్రీశైలం యాదవ్, అతడి సోదరుడు రమేష్ యాదవ్తో సహా 19 మంది, బోరబండ పీఎస్ పరిదిలో 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.
ఎన్నికల వేళ రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచినట్లు పోలీసులు తెలిపారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పలువురు రౌడీ షీటర్లపై కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు పనిచేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.