పీర్జాదిగూడ, అక్టోబర్ 25: గుట్టుచప్పుడుకాకుండా ఆన్లైన్ ద్వారా ఓ ఇంట్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి ఓం విహార్ కాలనీకి చెందిన మెట్టు రాజేశ్ (40) తన ఇంట్లో కేహెచ్బీకాలనీకి చెందిన కోమటిరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి (36), కుత్బుల్లాపూర్ చింతలబస్తీకి చెందిన కేశన గోపీనాథ్ (27), గడ్డం కార్తిక్ కుమార్(28)తో కలిసి కర్ణాటకకు చెందిన చిరంజీవి వాట్సాప్ ద్వారా విన్ విజన్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూప్లో బెట్టింగ్పై ఆసక్తి ఉన్న వారిని యాడ్ చేశారు.
ఇండియాలో జరిగే హార్స్ రేసులను బెట్ 365 ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకుంటున్నారు. వాటి వివరాలను వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఔత్సాహకులతో బెట్టింగ్కు పాల్పడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు మంగళవారం సాయంత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తుండగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకొని, అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.