ఖైరతాబాద్, అక్టోబర్ 18 : పని మనుషులుగా చేరి.. రూ.85 లక్షలకు పైగా విలువైన సొత్తును అపహరించిన నేపాలీ గ్యాంగ్ను పట్టుకునేందుకు సెంట్రల్ జోన్ పోలీసు బృందం నిమగ్నమయ్యింది. ఈనెల 16న తెల్లవారుజామున సైఫాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని చింతల బస్తీలో యజ్ఞా అగర్వాల్ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితుల కోసం హైదరాబాద్ నుంచి నేపాల్ బోర్డర్ వరకు ప్రత్యేక బృందాలను తరలించారు. దొంగతనానికి పాల్పడిన నిందితులు ప్రయాణించిన రైళ్లు, ఇతర రవాణా వ్యవస్థల్లో ఉన్న సీసీ ఫుటేజీలను సైతం సేకరించారు. వీరి కదలిక ఉన్నట్లు తెలుసుకున్న ఓ బృందం లక్నో, నాగ్పూర్ ప్రాంతాల్లో ఇప్పటికే దర్యాప్తు చేపడుతుండగా, యజ్ఞా అగర్వాల్ ఇంట్లో గతంలో పనిచేసి మానేసి.. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న నేపాల్కు చెందిన చోటు, మీనాలను సైఫాబాద్ డీఐ విచారణ కోసం పీఎస్కు తీసుకువచ్చారు.
నిందితులు బీపేశ్, అనిత శశి అలియాస్ నిఖితల కంటే ముందు ఇదే ఇంట్లో పనిచేశారు. వీరు కూడా నేపాల్కు చెందిన వారు కావడం, వారితో వీరికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెంట్రల్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల డీఐలు, ఒక్కో ఎస్సై ఈ దర్యాప్తులో పాలుపంచుకుంటున్నారు. జాతీయ రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. నిందితులు ఐదుగురు ఒకే ప్రాంతానికి వెళ్లారా.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారా.. అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులు నేపాల్కు చెందిన వారు కావడంతో బోర్డర్ వద్ద ఉన్న అధికారులకు సీసీ ఫుటేజీలు, నిందితుల వివరాలను సైఫాబాద్ పోలీసులు షేర్ చేశారు. నేపాల్ బోర్డర్ సమీప గ్రామ ప్రజలు భారతదేశంలోని వివిధ రాష్ర్టాలకు వస్తుంటారని గుర్తించారు. పాత నేరస్తుల జాబితాల్లో ఉండే అవకాశం కూడా ఉండటంతో ఫేస్ రికగ్నైజేషన్ సైతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు బృందాలు బోర్డర్ అవతల ఆ దేశపు సెక్యూరిటీ సిబ్బందిని సైతం సంప్రదిస్తున్నట్లు తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే ఆ నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.