సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, రాచకొండ సీపీ మహేశ్భగవత్ కోరారు. బుధవారం నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈ నెల 21న జరుగనున్న బక్రీద్ పండుగ ఏర్పాట్లపై ట్రై పోలీస్ కమిషనరేట్ల ఉన్నతాధికారులు, పశు సంవర్ధకశాఖ, జీహెచ్ఎంసీ, రోడ్డు రవాణా, వెటర్నరీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పశువులను రవాణా చేసే వాహనానికి తప్పని సరిగా పశు సంవర్ధక శాఖ నుంచి సర్టిఫికెట్ ఉండాలని, ప్రతి చెక్పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తారని పోలీసు అధికారులు సూచించారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పోలీసులకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. రాత్రి వేళల్లో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు బందోబస్తులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు శిఖా గోయెల్, అనిల్కుమార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.