కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 12 : మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించడంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం కసరత్తు చేస్తుంది. కొన్నేండ్ల క్రితం ఏర్పడ్డ స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీ) పురోగతిని సాధిస్తూ రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలను పొందుతున్నాయి. గతం లో మాదిరిగా కాకుండా స్వయం సహాక బృందాలన్నింటినీ ఆన్లైన్ చేయడం, సభ్యుల వివరాలు, సంఘం పొందిన అప్పులు, అర్హతలు, ఆన్లైన్లో పొందుపరిచారు. పారదర్శకంగా మహిళా సంఘాలకు రుణాలను అందిస్తూ వారి పురోగతికి సహకారాన్ని అందిస్తున్నారు. కొత్త సంఘాలను ఏర్పాటు చేస్తూ అర్హతలను బట్టి రుణాలను అందిస్తున్నారు.
లక్ష్యాన్ని మించి రుణాలు..
కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 3430 స్వయం సహాయక బృందాలు (ఎస్హెచ్జీ)లు కొనసాగుతున్నాయి. కూకట్పల్లి సర్కిల్లోని ఆరు వార్డులలో 1780, మూసాపేట సర్కిల్లోని ఐదు వార్డులలో 1650 ఎస్హెచ్జీలు ఉన్నాయి. ఈ ఎస్హెచ్జీలలో రుణాలు పొంది సక్రమంగా బ్యాంకు లావాదేవీలు నిర్వహించడంలో కొన్ని విఫలం కాగా.. మరికొన్ని దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిఏటా ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలందించేందుకు లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. దీనిలో భాగంగా ఈ యేడాదిలో కూకట్పల్లి జంట సర్కిళ్లలో ఎస్హెచ్జీలకు రూ. 52 కోట్ల రుణాల లక్ష్యాన్ని నిర్దేశించారు. కూకట్పల్లి సర్కిల్కు రూ.28 కోట్లు, మూసాపేట సర్కిల్కు రూ.24 కోట్ల లక్ష్యాన్ని మించి రుణాలను అందించారు. జంట సర్కిళ్లలో రూ.52 కోట్లకు గాను రూ.56 కోట్ల రుణాలను ఎస్హెచ్జీలకు అందించారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే మూసాపేట సర్కిల్ లక్ష్యం రూ.28 కోట్లు కాగా రూ.30కోట్ల రుణాలను అందించారు. అలాగే కూకట్పల్లి సర్కిల్ లక్ష్యం రూ.24 కోట్ల కాగా ఇప్పటి వరకు రూ.26 కోట్ల రుణాలను బ్యాంకు లింకేజీల ద్వారా ఎస్హెచ్జీకు అందించారు. వచ్చే యేడాది మార్చి వరకు గడువు ఉండడంతో మరిన్ని రుణాలను ఎస్హెచ్జీలకు అందించేందుకు ప్రాజెక్టు విభాగం సిబ్బంది కృషి చేస్తున్నారు.
కొత్త సంఘాల ఏర్పాటుకు కసరత్తు..
ఈ ఏడాది జంట సర్కిళ్లలో 56 కొత్త మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. మూసాపేట సర్కిల్లో 43, కూకట్పల్లి సర్కిల్లో 43 ఎస్హెచ్జీలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా మరికొన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే దివ్యాంగులతో స్వయం సహాయక బృందాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు.
సంఘాలతో మహిళలకు మేలు..
మహిళా సంఘాలలో సభ్యులుగా ఉండడం వల్ల వడ్డీలేని రుణాలు పొందవచ్చు. ఈ ఏడాది ఎస్హెచ్జీలకు బ్యాంకు లింకేజీ లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేస్తున్నాం. మహిళా సం ఘాల వివరాలను ఆన్లైన్లో పొందపర్చచడం, అర్హత కలిగిన మహిళలందరినీ సంఘాలలో చేరాలని కోరుతున్నాం.
– ఇంద్రసేనా, ప్రాజెక్ట్ ఆఫీసర్,కూకట్పల్లి సర్కిల్