వేదపారాయణాలు.. యజ్ఞయాగాలు.. మంత్ర హవనం.. పురాణ, ఇతిహాసాలు.. లక్ష్మీనారాయణుడి మహాయజ్ఞ శోభాయాత్రతో శ్రీ భగవద్రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల అంకురార్పణ బుధవారం దేదీప్యమానమైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని శ్రీరామనగరం వెయ్యేండ్ల పండుగతో పులకించిపోతోంది. కోలాటాలు, నృత్యాలు, శ్రీమన్నారాయణ సంకీర్తనలతో ఆధ్యాత్మికత పరిఢవిల్లింది. 5 వేలమంది రుత్వికులు, 144 హోమశాలలు, 1035 యాగకుండలతో లక్ష్మీనారాయణ మహాయజ్ఞ పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని శ్రీరామనగరంలో శ్రీరామానుజ స్వామివారి సహస్రాబ్ది సమారోహ కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. బుధవారం శ్రీరామనగరంలో చినజీయర్ ఆశ్రమం నుంచి శ్రీ పెరుమాళ్ల లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఈ యాత్ర యాగశాలకు చేరుకుంది. శోభాయాత్రలో అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ రామనుజ జీయర్ స్వామి, రామచంద్రరామానుజ జీయర్ స్వామి, అష్టాక్షర రామానుజ జీయర్ స్వామి పాల్గొన్నారు. రామానుజ శ్లోకాలు, భక్తి పాటలు, నినాదాలు, వాయిద్యాల నడుమ యాత్ర అత్యంత భక్తిపరవశంతో సుమారు 3 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ సందర్భంగా కోలాటాలు, నృత్యాలతో శ్రీమన్నారాయణ సంకీర్తనలు ఆలపించారు. యాగశాలలో శాంతిహోమం నిర్వహించి భక్తులకు చినజీయర్ స్వామి ప్రవచనాన్ని వినిపించారు. చినజీయర్తోపాటు పూజల్లో మైహోం అధినేత జూపల్లి రామేశ్వర్రావు, మైహోం ఎండీ జూపల్లి జగపతిరావు, ఢిల్లీలో తెలంగాణ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, నృత్యాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి.
పరిశుభ్రతకు ప్రాధాన్యత
శ్రీరామానుజ స్వామివారి సహస్రాబ్ధి సమరోహ వేడుకల్లో తాగునీటి వసతితో పాటు భోజనశాల, రుత్వికులు విడిదిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఒమిక్రాన్ విస్తరిస్తున్న తరుణంలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేసి టెంపరేచర్ను చెక్ చేశారు. యశోదా దవాఖాన సౌజన్యంతో అధికారులు వైద్య సిబ్బంది సేవలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చిత్రపటాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నది. ఏటీఎం సేవలను అందుబాటులో ఉంచారు. మీడియాతో పాటు పోలీసు హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ప్రారంభోత్సవ కార్యక్రమాలు వేదమంత్రాలు, యజ్ఞయాగాలతో శ్రీరామనగరంలో బుధవారం మొదటిరోజు పూజలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. నగర శివారు ప్రాంతంలోని శంషాబాద్ ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహం వద్ద వైదిక శ్రీలక్ష్మీనారాయణ మహాయజ్ఞ శోభాయాత్రతో ప్రారంభమైన కార్యక్రమాలు శ్రీరామ నామస్మరణలతో మార్మోగాయి. ఆధునిక చరిత్రలో పవిత్ర యాగశాల సమర్పణ ప్రపంచంలోనే అతిపెద్ద యజ్ఞంగా నిలిచిపోవడం విశేషం. శ్రీజయంతి ఉత్సవాలలో భాగంగా 5000 మంది వేదపండితులు 144 హోమశాలలు, 1035 యాగ కుండలతో శ్రీలక్ష్మీ నారాయణ మహాయజ్ఞ పూజలు అంగరంగ శోభాయమానంగా జరిగాయి.
వెయ్యిమంది విద్యార్థులతో వేద పఠనాలు
మొదటిరోజు యాగశాలల ప్రవేశానికి శ్రీరామానుజాచార్యుల ఆశ్రమంలోనే విద్యాభ్యాసం చేసిన వెయ్యిమంది విద్యార్థులతో వేదపఠనాలను చేయించారు. యాగశాల ప్రవేశాలు ఆద్యంతం భగవంతుడే రామానుజాచార్యుల ఆశ్రమంలో నడియాడినట్లుగా అందరినీ ఆకట్టుకోవడం విశేషం. వేలాది మంది కళాకారుల ఆటాపాటలతో శ్రీలక్ష్మీనారాయణ విగ్రహ శోభాయాత్రను సాగించారు. వేదాల మంత్రఘోషలతో మార్మోగిన శ్రీ రామనగరం ఆద్యంతం… ఆనందశోభితంగా మారింది.
దేశ నలుమూలల నుంచి విశేషమైన కళాకారుల బృందాలు శ్రీ రామానుజాచార్యుల ఆశ్రమంలో ఆటాపాటలతో అలరించారు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి నృత్య కళాకారుల బృందాలు హాజరై స్వామివారి అంకురార్పణ కార్యక్రమానికి ఆటాపాటలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. ఈ సందర్బంగా 108 దివ్యదేశాల ఆలయాల నుంచి ఆళ్వార్ ఆలయ ప్రాంగణాల మీదుగా యజ్ఞశాలకు స్వామివారిని ఊరేగించారు.
దేశ నలుమూలల నుంచి కళాకారుల రాక
నిత్యపూజలలో వేద వచనాలు
శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో బుధవారం నాలుగు వేదాలలోని తొమ్మిది విభాగాల నుంచి మంత్రోచ్ఛరణలు రాబోయే పన్నెండు రోజుల పాటు పురాణాలు, హితిహాసాలు, ఆగమన శాస్త్రంలోని వేదమంత్రాలను క్రోడీకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం మొదటి పూజ సూర్యోదయ నమస్కారం నుంచి గణపతి, గోమాత, యజ్ఞ, ఆగమనశాస్ర్తాలతో పూజలు ప్రారంభించి యజ్ఞశాల ప్రవేశం, సాయంకాలం ఆరుగంటలకు అంకురార్పణతో పూజలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 5వేల మంది వేదపండితులు స్వామివారి పూజలకు అంకురార్పణలు ప్రారంభించి మంత్రపఠనాలు ప్రారంభించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో 14 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆశ్రమం వద్ద పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారని వివరించారు. శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే భక్తులను లోపలికి అనుమతిస్తున్నారు. ఎమ్మెల్యే వెంట శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్ లీడర్ నీరటి తన్వి రాజు, మండల పార్టీ అధ్యక్షులు చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ నీలం మోహన్ నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ముచ్చింతల్ హౌస్పుల్
సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు
రోజుకు అద్దె వెయ్యికి పైగానే
చుట్టు పక్కల గ్రామాలు, ఫాంహౌస్ల్లోనూ సందడి
మొన్నటి వరకు అది ఓ సాధారణ గ్రామం. శంషాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి నుంచి 3-4 కిలో మీటర్ల దూరం లోపలికి వెళితే ఆ గ్రామం వస్తుంది. అలాంటి గ్రామం ఇప్పుడు ఒక్కసారిగా అంబరాన్నంటే సంబురాలకు వేదికైంది. 14 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు, ఊరేగింపులు, అతిరథ మహారథులు రాకపోకలు… ఇలా ఎంతో ప్రతిష్టాత్మకమైన వేడుకలకు ముచ్చింతల్ గ్రామం వేదికైంది. శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్లో చిన జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలతో దేశవ్యాప్తంగా ఖ్యాతి గడించింది. సాక్షాత్తు భారత రాష్ట్రప్రతి, ప్రధానమంత్రితో పాటు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలకు విచ్చేస్తున్నారు. 14 రోజుల పాటు జరిగే ఉత్సవాలతో ఈ ప్రాంతంలో ఒక్కసారిగా భక్తుల తాకిడి ఎవరూ ఊహించనంతగా పెరిగింది. వేడుకలకు వచ్చి ఒకటి, రెండు రోజుల పాటు ఇక్కడే ఉందామనుకునే వారికి ముచ్చింతల్ గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇండ్లు అద్దెకు దొరకని పరిస్థితి నెలకొన్నది. ఊర్లో ఎవరిని అడిగినా ఒక్క గది కూడా అద్దెకు ఇచ్చేందుకు అందుబాటులో లేవనే సమాధానం ఎదురవుతోంది. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి కొందరు గదులను ముందుగా బుక్ చేసుకున్నారని గ్రామ నివాసి నర్సింలు తెలిపారు.
భారీ బందోబస్తు
14 రోజుల పాటు జరిగే ఉత్సవాల బందోబస్తుకు సుమారు 1000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. శ్రీరామనగరంలో జరుగనున్న వేడుకలకు హాజరయ్యే భక్తులు, ప్రజలకు ఏమైనా సమస్యలు వస్తే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్లు 9490617444, 7901114100కు ఫిర్యాదు చేయాలని సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
భక్తులకు ఉచిత రవాణా
శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 2: వివిధ ప్రాంతాల నుంచి రామానుజ జీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. శంషాబాద్ మండలంలోని పాలమాకుల, మదన్పల్లి, పెద్ద గోల్కొండ ప్రాంతాల నుంచి ఆశ్రమం వరకు భక్తులకు ప్రయాణం ఉచితం. ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను అందుబాటులో ఉంచి, భక్తులను ఆశ్రమం వరకు తీసుకురానున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు 14 రోజుల పాటు ఇలాంటి సౌకర్యాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.