సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : నిత్యం పదుల సంఖ్యలో మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించడంతో పాటు వివిధ అనారోగ్య కారణాలతో మృత్యువాత పడిన పార్ధీవ దేహాలను భద్రపరిచే ఉస్మానియా మార్చురీ అభివృద్ధికి ఎట్టకేలకు నిధులు మజూర య్యాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఉస్మానియా మార్చురీ పక్కనుంచి వెళ్లేందుకే ముక్కు మూసుకుని పోవాల్సిన పరిస్థితికి తెలంగాణ సర్కార్ విముక్తి కల్పించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉస్మానియా మార్చురీకి రూ.5.90 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
మార్చురీలో అధునాతన సౌకర్యాలు
అత్యాధునిక ఫ్రీజర్స్, సెంట్రల్ ఏసీతో కూడిన పప్ రూమ్, ఫోరెన్సిక్ బోధన పరికరాలు, ఆర్గాన్ వెయిట్స్, డిపార్ట్మెంటల్ రూమ్స్ వంటి అధునాతన సౌకర్యాలను ఈ నిధులతో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ తెలిపారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఆధునిక ఫ్రీజింగ్ బాక్సుల్లో 10నుంచి 15 మృతదేహాలను, సెంట్రల్ ఏసీ సౌలభ్యమున్న పప్ రూమ్స్లో పదుల సంఖ్యలో మృతదేహాలను భద్రపర్చవచ్చని పేర్కొన్నారు. సివిల్(నిర్మాణ పనులు), ఎక్విప్మెంట్(వైద్య పరికరాలు)లతో పాటు స్త్రీ, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్ సదుపాయాలతో కూడిన వెయిటింగ్ హాల్, మంచినీటి సదుపాయం, అదనపు సిబ్బందిని ఉస్మానియా మార్చురీలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఛాతి దవాఖానలో రూ.55.45లక్షలతో..
ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో ఉన్న మార్చురీని సైతం ఆధునీకరించనున్నారు. ఈ దవాఖానలో పోస్టుమార్టం జరుపకపోయినా చికిత్స పొందుతూ మృతిచెందిన మృతదేహాలను భద్రపరుస్తారు. ఇందుకోసం రూ.55.45లక్షలతో అత్యాధునిక ఫ్రీజర్లు, వెయిటింగ్ హాల్ వంటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఫీవర్ దవాఖానలో రూ.60.95లక్షలతో..
నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఇప్పటి వరకు మృతదేహాలను భద్రపరిచే మార్చురీ లేదు. కొత్తగా రూ.60.95లక్షలతో మృతదేహాలను భద్రపరిచేందుకు అత్యాధునిక ఫ్రీజర్లు, వెయిటింగ్హాల్ తదితర సౌకర్యాలతో మార్చురీని అందుబాటులోకి తీసుకురానున్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో..
రంగారెడ్డి జిల్లా పరిధిలోని రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లలో మార్చురీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా పరిధిలోని చేవెళ్ల సీహెచ్సీలో రూ.43.40లక్షలతో నూతనంగా మార్చురీని ఏర్పాటు చేయనున్నారు. ఇబ్రహీంపట్నం సీహెచ్సీలో రూ.41.40లక్షలతో నూతనంగా మార్చురీని ఏర్పాటు చేయనున్నారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో..
మేడ్చల్ జిల్లా పరిధిలోని ఘట్కేసర్ సీహెచ్సీలో రూ.30.90లక్షల వ్యయంతో ఆధునిక సౌకర్యాలతో మార్చురీని అందుబాటులోకి తీసుకురానున్నారు.