సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన సందడిగా సాగుతున్నది. వీకెండ్ కావడంతో శనివారం తమకు ఇష్టమైన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. 365 స్టాళ్లు కలియ తిరుగుతూ నచ్చిన పుస్తకాలను కొన్నారు. ముఖ్యంగా పిల్లలు సాహిత్యం, ఆధ్యాత్మికత, ఉమెన్ సక్సెస్ స్టోరీలు, చట్టాలు, పిల్లల కార్టూన్ పుస్తకాలు వంటివి అధికంగా కొనుగోలు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు నోరూరించే వంటకాలు సైతం అందుబాటులో ఉండటంతో పుస్తక ప్రియులు ఆహారప్రియులుగా మారి నచ్చిన రుచులను ఆస్వాదించారు. మరోవైపు బుక్ ఫెయిర్లోని రవ్వా శ్రీహరి వేదికపై జరిగిన సాహిత్య కార్యక్రమాలు అలరించాయి.
రవ్వ శ్రీహరి వేదికపై శనివారం సాయంత్రం 5 గంటలకు గులాబీల మల్లారెడ్డి రచనలు ‘పాలపిట్ట ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ జరిగింది. ప్రేమ పవనాలు-మానవతా సౌరభాల నవలను అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరించగా, ఐదుతరాలు కథల పుస్తకాన్నీ డా.కాంచనపల్లి గోవర్ధన్ రాజు, పాలపిట్ట ప్రత్యేక సంచికను డా.ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వేముల ప్రభాకర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
పాటతో ఓ సాయంకాలం పేరుతో గద్దర్ సంస్మరణ సభ జరిగింది. హెచ్బీఎఫ్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్, డా. పసునూరి రవీందర్ అధ్యక్షతన గద్దర్ పోరాట జీవితంపై ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, జయరాజు, విమలక్క, ఏపూరి సోమన్న, ప్రొఫెసర్ కాశీం ప్రసంగించారు.