సిటీబ్యూరో, జనవరి 27 ( నమస్తే తెలంగాణ ) : సాహితీ పండుగ హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కొలువుదీరింది. సైఫాబాద్లోని విద్యారణ్య స్కూల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ సాహితీ ఉత్సవ ప్రారంభానికి శుక్రవారం జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో హాజరయ్యారు. మొదటి చర్చలో భాగంగా భాషా, స్వేచ్ఛ, భిన్నాభిప్రాయాలు, సాహిత్యాభివృద్ధికి కృషి తదితర అంశాలపై తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అధ్యక్షతన చర్చాగోష్ఠి జరిగింది.
ఈ సందర్భంగా జర్మనీ ఎంబసీ డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ డాక్టర్ స్టిఫెన్ గ్రాబెర్ మాట్లాడుతూ.. పుస్తకం చదవడం అనేది నడవడం లాంటిదని.. నడిచే క్రమంలో కొంతమంది తెలియని వాళ్ల, తెలిసిన వాళ్లు కనిపిస్తారని..అట్లాగే బుక్ రీడింగ్లో కూడా కొన్ని తెలిసినవీ, తెలియనీ విషయాలు కనిపిస్తాయన్నారు. మొత్తంగా పుస్తకం చదవడం అనేది కొత్తప్రపంచాన్ని పరిచయం చేస్తుందని చెప్పారు. ప్రపంచాన్ని చదవాలంటే పుస్తకం చదివే అలవాటు ఉండాలని తెలిపారు. అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద సాహిత్య ఫెస్టివల్ జైపూర్లిటరరీ ఫెస్ట్ దీటుగా హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ ఉందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చొరవతో సాహిత్య కంటెంట్ను డిజిటలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కంటెంట్ను కూడా డిజిటల్గా అందుబాటులో ఉంచేల చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలా చేయడం వల్ల అందరికి హెచ్ఎల్ఎఫ్ కంటెంట్ అందుబాటులో ఉంటుందని వివరించారు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అనేవారని..ఇప్పుడు హైదరాబాద్ అనేస్థాయికి ఎదిగామని గుర్తు చేశారు. కాగా ఈ కార్యక్రమం శని, ఆదివారం వరకు జరగనుంది.
నేడు ‘ద లాస్ట్ హీరోస్’ పోల్డియర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడంపై పి.సాయినాథ్, రాజ్యాంగంపై కల్పన కన్నాభిరన్ మాట్లాడుతారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పిన్న వయస్కులు పూర్ణ మాలవత్, అపర్ణ తోటలతో చర్చా కార్యక్రమం ఉండనుంది. అనంతరం కావ్యధార, స్టేజ్ టాక్స్, వర్క్షాప్స్, స్టోరీ టెల్లింగ్, మూవింగ్ ఇమేజెస్ టాకీస్ తదితర కార్యక్రమాలు ఉండనున్నాయి.