హైదరాబాద్ : అనతికాలంలోనే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. వరల్డ్ క్లాస్ సిటీగా అవతరించిందని బెంగళూరులోని కెనడా కాన్సుల్ జనరల్ బెనాయిట్ ప్రిఫోంటైన్ అన్నారు. హైదరాబాద్లోని ఎఫ్టీసీసీఐలో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశంలోనే కెనడా పెట్టుబడులు పెట్టిందని.. కానీ ప్రస్తుతం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉందని తెలిపారు.
హైదరాబాద్లో ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరో స్పేస్ తదితర రంగాలను స్థాపించేందుకు ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ సర్కారు చూపిస్తున్న చొరవ అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. ఇటీవలే ఇండియా- కెనడా మధ్య వాణిజ్య ఒప్పందం జరిగిందని గుర్తు చేశారు. సౌత్ ఇండియా సీనియర్ ట్రేడ్ కమిషనర్, బెంగళూరులోని కెనడా కాన్సులేట్ జనరల్ కెన్నెత్ వాంగ్ మాట్లాడుతూ… ఉత్తర భారతదేశంలోని కెనడా వాణిజ్య వ్యాపారాన్ని దక్షిణ భారతదేశానికి విస్తరింపజేస్తామని తెలిపారు. తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నామని చెప్పారు.
ఎఫ్టీసీసీఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ… హైదరాబాద్లో పెట్టుబడుల కోసం కెనడాను ఆహ్వానించేందుకే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ఐటీ, ఫార్మా, రక్షణ రంగం, వ్యవసాయం, పాల ఉత్పత్తి తదితర రంగాల్లో తెలంగాణ వేగంగా పురోగతి సాధిస్తున్నదని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తే అన్నివిధాలా ముందుండి నడిపిస్తామన్నారు. తెలంగాణ సర్కారు అన్ని రకాల వసతులు, రాయితీలను కల్పిస్తుందని తెలిపారు.