బంజారాహిల్స్ (హైదరాబాద్ ) : దేశంలోనే అత్యధిక నిఘా కెమెరాలు కలిగి ఉన్న నగరంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు ఉందని నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ (City Police Commissioner) అన్నారు. బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు వాక్వేలో రూ.80లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 152 సీసీ కెమెరాలను, జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో రూ.60లక్షల వ్యయంతో కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 112 సీసీ కెమెరాలను కమిషనర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో (People Participate )హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాల ( Cameras )ను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలకు పాల్పడిన నిందితులను నిమిషాల వ్యవధిలోనే గుర్తించగలుగుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) పోలీసుశాఖపై ప్రత్యేక దృష్టి సారించి అనేక రకాల సౌకర్యాలను కల్పించారన్నారు. అత్యాధునిక పెట్రోలింగ్ వాహనాలతో పాటు పోలీస్స్టేషన్ల నిర్మాణంతో పోలీసుశాఖ రూపురేఖలు మారాయన్నారు. ఇదే క్రమంలో నేరాల అదుపు కోసం రాష్ట్రంలో లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు.
పౌరుల భాగస్వామ్యంతో చేపట్టిన కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్ట్, నేను సైతం కార్యక్రమం, సేఫ్సిటీ ప్రాజెక్టు తదితర కార్యక్రమాలతో పాటు మెట్రోరైల్ కెమెరాలు,హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో కెమెరాలలను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు జరిగిందన్నారు. దేశంలోని మొత్తం సీసీ కెమెరాల్లో 62శాతం సీసీ కెమెరాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని, సాధించిందన్నారు. హైదరాబాద్ నగరంలో నేరం చేస్తే తప్పించుకోవడం అసాధ్యం అనే విధంగా సీసీ కెమెరాలు, ఫేస్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్ తదితర టెక్నాలజీలను వినియోగిస్తున్నామన్నారు.
కెమెరాల మెయింటెనెన్స్ కోసం క్యామో పేరుతో ప్రత్యేక విభాగం..
నగరంలో ఏర్పాటు చేస్తున్న సీసీ కెమెరాల్లో చాలా భాగం 3నుంచి 5 ఏళ్లదాకా మాత్రమే పనిచేస్తుంటాయని, వాటిని మరమ్మతులు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు లోపాలను సరిచేసేందుకు క్యామో( కెమెరా మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ తెలిపారు. కెమెరాల ఏర్పాటుకు మరింత మంది పౌరులు. వ్యాపార సంస్థలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ గజరాజ్ భూపాల్, వెస్ట్జోన్ డీసీపీ జోయల్ డేవిస్, అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దిఖీ, బంజారాహిల్స్ ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.