సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): త్వరలోనే 80 వేల పైచిలుకు ఉద్యోగాలకు
నోటిఫికేషన్ వేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగులు అలర్ట్ అయ్యారు. పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో రీడింగ్ మూడ్లోకి వెళ్లిపోయారు. ఫలితంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని అశోక్నగర్, గాంధీనగర్, దిల్సుఖ్నగర్, అంబర్పేట్, విద్యానగర్, డీడీకాలనీ, నల్లకుంట, బర్కత్పుర, అమీర్పేట్, ఎస్ఆర్నగర్ తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లే కాకుండా స్టడీ రూమ్స్ విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు, అభ్యర్థులు రీడింగ్ హాల్స్కు అత్తుకుపోతున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్నగర్, గాంధీనగర్లలో 15వరకు, దిల్సుఖ్నగర్ ప్రాంతంలో పదుల సంఖ్యలో రీడింగ్ హాల్స్ ఉన్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు.
చదివిన వారికి చదివినన్ని గంటలు
ఉదయం 6నుంచి మొదలుకొని 24 గంటల పాటు చదువుకునేందుకు రీడింగ్ రూమ్స్ సౌకర్యవంతంగా ఉన్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. యువకులకు 24 గంటల పాటు చదువుకునేందుకు అవకాశం ఉండగా.. యువతులకు ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సమయం కేటాయించారు. ఇందుకు తగ్గట్టుగానే వైఫైతో పాటు తాగునీటి వసతి, వాష్రూమ్స్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. అయితే కొందరు అభ్యర్థులు ఇప్పటికే పలు సబ్జెక్టులు పూర్తి చేశామని, తిరిగి రివిజన్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నామని పేర్కొంటుండగా.. మరికొందరు ఇప్పుడే చదవడం ప్రారంభించామని, నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ను పూర్తి చేసి పునశ్చరణకు సిద్ధంకావాలని తెలుపుతున్నారు. అయితే ఏసీ రూమ్లకు రూ.1400 నుంచి రూ.1500 వరకు, నాన్ ఏసీ రూమ్లకు రూ.900 నుంచి వెయ్యివరకు ఫీజు తీసుకుంటున్నట్లు అభ్యర్థులు పేర్కొంటున్నారు.
పోటీ పరీక్షల అధ్యయన వేదికలు..
అభ్యర్థులు పోటీపరీక్షల కోసం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. గ్రూప్స్-1, 2, 3, 4 తో పాటు పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్ లాంటి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారు. గత ఆరు నెలల నుంచే నిర్విరామంగా కష్టపడుతున్నట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చే వరకు పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు నిరంతర అధ్యయనాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొంటున్నారు.
సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా
అశోక్నగర్లోని హాస్టల్లో ఉంటూ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ ఉండి చదివితేనే పోటీతత్వం అలవడుతుంది. అందుకే హాస్టల్స్, రీడింగ్ రూమ్స్, లైబ్రరీలు లాంటి ప్రాంతాలు అభ్యర్థులతో నిత్యం నిండిపోతాయి. ఒకరిని చూసి ఒకరు ఇంకా చదవాలనే లక్ష్యంతో సబ్జెక్టులన్నీ పూర్తిచేసి రెండు మూడు సార్లు రివిజన్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
– మేఘన, జిల్లెల్లగూడ,హైదరాబాద్
ఆరు నెలల నుంచి సిద్ధమవుతున్నా
ఆరు నెలల నుంచి ప్రిపరేషన్లో ఉన్నాను. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం సబ్జెక్ట్స్ పూర్తయ్యాయి. నోటిఫికేషన్ వచ్చేలోపే మిగతా అంశాలను చదవడం పూర్తి చేయాలి. అట్లయితేనే ఉద్యోగం సాధిస్తామనే నమ్మకం ఏర్పడుతుంది. రివిజన్ చేసుకొని నోట్స్ రాసుకుంటేనే అన్నీ గుర్తుంటాయి. కాబట్టి నోటిఫికేషన్కు ఎదురు చూడకుండా ప్రిపరేషన్ను కొనసాగిస్తున్నాను. నల్లకుంటలోని రాయల్ స్టడీహాల్లో నిత్యం చదువుతున్నా.
– స్వప్న, గ్రూప్-2 అభ్యర్థి, సిద్దిపేట