సిటీబ్యూరో, మార్చి 19(నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా ఆలుగడ్డల మాటున సరుకు సరఫరా చేసేందుకు ప్లాన్ వేశారు. చెక్ పాయింట్ల వద్ద ఆలుగడ్డ సంచులను కిందకు దించి.. తనిఖీ చేయడం అంత సులభం కాదనుకొని.. భ్రమపడి.. ఈ ఎత్తుగడ వేశారు మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు. అయితే పక్కా సమాచారంతో సైబరాబాద్ పోలీసులు నిందితుల ఆటకట్టించారు. రూ. 1.30 కోట్ల విలువ చేసే 560 కేజీల సరుకును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం..మహారాష్ట్రకు చెందిన నౌషాద్ పేరు మోసిన గంజాయి స్మగ్లర్. తన బంధువైన సలీం ఉల్లా అలియాస్ రాజుతో కలిసి గంజాయి రవాణా చేస్తుంటాడు. ఒడిశాకు చెందిన సంతోష్ ద్వారా సరుకు సేకరించి.. హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే 15 రోజుల కిందట నౌషాద్ వెయ్యి కేజీల గంజాయిని సంతోష్కు ఆర్డర్ ఇచ్చాడు. ఇందుకోసం సలీం ఉల్లా, షేక్ రహమాన్, షేక్ వాసీమ్లను కారులో భద్రాచలానికి పంపాడు.
అక్కడ హైదరాబాద్కు చెందిన ఇక్బాల్ డీసీఎం వ్యాన్ను అప్పగించడంతో సలీం ఉల్లా అందులో 3 టన్నుల ఆలుగడ్డల సంచులను నింపాడు. ఒడిశా చిత్రకొండ అటవీ ప్రాంతంలో సంతోష్ ఆ వ్యాన్లో ఆలుగడ్డల కింద గంజాయిని ప్యాకెట్లు పెట్టి..సలీం ఉల్లాకు అప్పగించాడు. అక్కడి నుంచి అతడు మహారాష్ట్ర అమరావతికి తరలించేందుకు బయలుదేరగా, ఎస్కార్ట్గా షేక్ రహమాన్, షేక్ వాసీమ్లు చెకింగ్ పాయింట్ల సమాచారం ఇస్తూ వస్తున్నారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ శనివారం తెల్లవారుజామున రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి హిమాయత్సాగర్ టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి నౌషాద్, సంతోష్ పరారీలో ఉన్నారు. ఆలుగడ్డలను రెండు, మూడు ట్రిప్పులకు ఉపయోగించుకొని.. వందల కిలోల గంజాయిని తరలిస్తున్నారని స్పష్టమైంది. పనిపూర్తయ్యాక ఆలుగడ్డలు పాడు కాకుండా ఉంటే వాటిని మార్కెట్లో అమ్ముతారని, లేదంటే పారేస్తారని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది.