మియాపూర్, జనవరి 3 : కరోనా మహమ్మారిని శాశ్వతంగా తరిమేసేందుకు ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి ఆ పై వయసు వారందరికీ ఉచితంగా టీకాను అందిస్తున్నదని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15-18 వయసు గల పిల్లలకు టీకా కార్యక్రమాన్ని కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలిసి విప్ అరెకపూడి గాంధీ సోమవారం ప్రారంభించారు. వైద్యురాలు డాక్టర్ మానస, హర్ష, సిబ్బంది భవానీ, నదియా, ప్రియాంక, శశిరేఖ, రాధ, జ్యోతి, రాజ్యలక్ష్మి, సంజీవని, పార్టీ నేతలు సమ్మారెడ్డి, గణేశ్, కాశీనాథ్, శ్రీనివాస్, రాజేశ్, షౌకత్ అలీ, వాసు, యాదగిరి, బాలస్వామి, రాజ్యలక్ష్మి, మంజు ల, కిషన్ పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోండి
హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి టీకాలను వేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ వి. జగదీశ్వర్గౌడ్లతో పాటు టీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
శేరిలింగంపల్లిలో..
అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 18 వయస్సు కలిగిన చిన్నారులకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
785 మందికి వాక్సిన్
హఫీజ్పేట్ డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య సిబ్బంది పలుచోట్ల ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. సోమవారం 785 మందికి టీకాలను వేశారు. హఫీజ్పేట్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొదటి, రెండో డోసులను కలిపి 345 మందికి టీకాలను వేయగా 15 నుంచి 18 ఏండ్ల వయసు వారికి 170 మందికి టీకాలను వేశారు. పీజేఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో మొత్తం 230 టీకాలను వేయగా 15 నుంచి 18 ఏండ్ల వయసు వారికి 40 మందికి టీకాలను వేశారు. అనంతరం 53 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ వినయ్ బాబు తెలిపారు.