కొండాపూర్, మే 3 : గుంతలు, ఇరుకైన మట్టి రోడ్లతో గత కొన్నేండ్లుగా సిద్ధిక్నగర్ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులు ఇక తొలగిపోనున్నాయి. శేరిలింగంపల్లి సర్కిల్ -20 పరిధిలోని కొండాపూర్ డివిజన్ సిద్ధిక్నగర్ కాలనీలోని అంతర్గత రహదారుల అభివృద్ధికి రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే కాలనీలో కొన్ని గల్లీల్లో సీసీ రోడ్లు సైతం పూర్తవ్వగా, మిగతా రోడ్ల నిర్మాణ పనులను వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాక ప్రారంభించనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. రోడ్ల నిర్మాణానికి ముందుగానే డ్రైనేజీ సమస్యలు, డ్రైనేజీ కనెక్టివిటీ లేని ఇండ్ల యజమానులు వెంటనే పనులు పూర్తి చేసుకోవాలని, నిర్మాణం పూర్తయ్యాక తవ్వకాలు చేపడితే సమస్యలు పునారావృతం అవుతాయని అధికారులు తెలిపారు.
ఉష్ణోగ్రతలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తాం
సిద్ధిక్నగర్ కాలనీకి మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన వెంటనే ప్రారంభిస్తాము. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నిర్మాణ పనుల్లో లోపాలు తలెత్తుతాయి. అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాలనీ వాసుల అంతర్గత రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నాం.
– జగదీశ్, ఇంజినీరింగ్ ఏఈ, కొండాపూర్